BC Reservations: బీసీ రిజర్వేషన్ల వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. రిజర్వేషన్లపై (BC Reservations) హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టులో మెన్షన్ చేశారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ధర్మాసనం దీనిపై విచారణ జరుపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే జారీ చేసింది. పాత పద్దతిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవచ్చని పేర్కొంది.
Also Read: Mallojula Venugopal: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు
స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్
కాగా, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోపై హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు విధించిన స్టేను తొలగించాలని పిటిషన్ లో పేర్కొంది. ఈ వారంలోనే విచారణ జరపాలని అభ్యర్థించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయ్యిందని, పలువురు నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారని పేర్కొంది. తమ వాదనలను పూర్తిగా వినకుండానే హైకోర్టు స్టే ఇచ్చినట్టుగా తెలియచేసింది.
సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ వద్ద మెన్షన్
కులగణన ద్వారా బీసీలకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించినట్టుగా పేర్కొంది. కమిషన్ అధ్యయనం తరువాతే రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించినట్టుగా తెలిపింది. తెలంగాణలో బీసీలు 56శాతానికి పైగా ఉన్నట్టు తెలిపింది. జనాభా నిష్పత్తి ప్రకారమే 42శాతం రిజర్వేషన్లు కల్పించినట్టుగా తెలిపింది. ఈ పిటిషన్ ను రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ వద్ద మెన్షన్ చేశారు. ఈనెల 16 లేదా 17వ తేదీన పిటిషన్ ను విచారణకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ అనుమతి తీసుకున్న తరువాత పిటిషన్ ను లిస్ట్ చేయనున్నట్టు రిజిస్ట్రార్ తెలిపారు.
Also Read: BC Reservations: బీసీ రిజర్వేషన్లపై సర్కార్ సవాల్.. సుప్రీం విచారణపై ఉత్కంఠ?
