తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : కేటగిరీలో ఉన్న ఎస్సీ కులాలపై ప్రభుత్వం పునరాలోచించాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం ఏ,బీ,సీ రిజర్వేషన్లు చేసిందన్నారు. మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారని గుర్తుచేశారు. ఏ కమిషన్ అయినా మాదిగలకు అన్యాయం చేసినట్లు.. తాజాగా షమీమ్ అక్తర్ కమిటీ కూడా అదే రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. దేని ఆధారంగా వర్గీకరించారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం మాదిగలకు11 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. అభివృద్ధి చెందిన కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చారన్నారు. బుడగజంగాలను ఏ గ్రూప్ లో, నేతకాని వర్గాన్ని సీ గ్రూప్లో ఉంచారన్నారు. ఎస్సీ వర్గీకరణలో వివేక్ వెంకటస్వామి హస్తం ఉందన్నారు. రేవంత్ రెడ్డి మాలలకు కొమ్ము కాస్తున్నారని, ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మాదిగలు ఎన్నో ఏళ్లుగా కులవివక్ష అనుభవించారని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, నాయకులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బొమ్మెర రామమూర్తి పాల్గొన్నారు.