Constable Murder Case: నిజామాబాద్లో జరిగిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో (Constable Murder Case) సస్పెన్స్ వీడింది. నిందితుడు రియాజ్ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మొత్తం 9 పోలీసు బృందాలతో గాలిస్తుండగా, ఎట్టకేలకు ఈ హంతకుడు చిక్కాడు. రియాజ్పై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. సారంపూర్ గ్రామ శివారులో కొన్నాళ్లుగా శిథిలావస్థలో ఉన్న ఒక లారీ క్యాబిన్లో రెండు రోజులుగా అతడు తలదాచుకున్నట్టుగా భావిస్తున్నారు. కాగా, శనివారం రాత్రి కూడా సారంపూర్లో కాలువ సమీపంలో పోలీసులపై నిందితుడు దాడి చేసే యత్నం చేశాడు. కానీ, పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. ఆ ఫామ్హౌస్లు ఉండే ఆ ప్రాంతంలో తప్పించుకొని పరిగెత్తినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
Read Also- Gadwal News: గద్వాల్లో చివరి రోజు మద్యం దుకాణాల దరఖాస్తులకు భారీ స్పందన
లారీ క్యాబిన్లో ఎవరో ఉన్నట్టుగా సమాచారం అందడంతో చుట్టుపక్కల 25 కిలోమీటర్ల మేర పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒకటి రెండు కిలోమీటర్ల దూరంలో పోలీసులు మోహరించి గాలింపు చేపట్టారు. దీంతో రియాజ్ ఎటూ తప్పించుకోలేకపోయాడు. లారీ క్యాబిన్లో ఉండి పోలీసులను చూసి పారిపోతుండగా, ఒక షెడ్డు వద్ద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ను అరెస్ట్ చేసిన ప్రాంతంలో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. రియాజ్ అరెస్ట్తో పోలీసులు ఊపిరిపీల్చుకున్నట్టు అయింది. కాగా, నిందితుడు రియాజ్పై చాలా కేసులు ఉన్నాయి. సుమారు ఏడు పోలీస్ స్టేషన్లలో అతడిపై 30కి పైగా కేసులు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు కనీసం 10 నుంచి 11 సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతడిపై రూ.50 వేల రివార్డ్ కూడా ఉంది.
కదిలిన డీజీపీ.. పోలీసు యంత్రాంగం
కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ తీసుకున్నాడు. నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు కేసును ఫాలోఅప్ చేశారు. మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా నిజామాబాద్ వెళ్లాలంటూ ఆదేశాలు ఇచ్చారు. పరిస్థితిని పర్యవేక్షించాలని సూచన చేశారు. కాగా, నిందితుడు రియాజ్ వాహనాల చోరీలు, చెయిన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పాత నేరస్తుడైన అతడిని విశ్వసనీయ సమాచారం మేరకు, నిజామాబాద్ సీసీఎస్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రమోద్ శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా, దారిలో అకస్మాత్తుగా కత్తితో ప్రమోద్ ఛాతీలో పొడిచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ కన్నుమూశారు. ఈ హత్య ఘటన సంచలనం రేపింది.
Read Also- Upasana Konidela: మెగా కోడలు దివాళి సెలబ్రేషన్స్ చూశారా.. థీమ్ అదిరింది గురూ..
ఈ హత్యపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి, రియాద్ను పట్టుకునేందుకు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాలని నిజామాబాద్ కమిషనర్ను ఆదేశించారు. ఆధారాలను బట్టి గాలింపు చేపట్టాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని సూచించారు. మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని సంఘటనా స్థలికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, వారికి అవసరమైన సహాయం చేయాలని కూడా డీజీపీ సూచించారు. డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ సీపీ 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న రియాద్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డ్ను కూడా ప్రకటించారు.
