Surrogacy Scam: సరోగసీ ద్వారా సంతాన భాగ్యం కలిగిస్తానని చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా తీసుకున్న బిడ్డను అప్పగించి అరెస్టయిన యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను గోపాలపురం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు జరిపించిన అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. కాగా, డాక్టర్ నమ్రత నాకేం తెలియదంటూ అమాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా తెలిసింది. వైజాగ్ బ్రాంచ్ మేనేజర్గా ఉన్న కళ్యాణీకే అన్ని విషయాలు తెలుసని జవాబులు చెబుతున్నట్టుగా సమాచారం.
Also Read- Balakrishna: ‘భగవంత్ కేసరి’కి జాతీయ అవార్డ్.. బాలయ్య స్పందనిదే!
రాజస్థాన్కు చెందిన గోవింద్ సింగ్ దంపతులు పిల్లలు పుట్టటం లేదని సంప్రదించగా డాక్టర్ నమ్రత మీకు సరోగసీ ద్వారా తల్లిదండ్రులయ్యే భాగ్యం కలుగుతుందని నమ్మించిన విషయం తెలిసిందే. అనంతరం గోవింద్ సింగ్ దంపతులను వైజాగ్లో తాను నడుపుతున్న మరో బ్రాంచ్కు పంపించింది. అక్కడి సిబ్బంది గోవింద్ సింగ్ వీర్యాన్ని సేకరించారు. సరోగసీకి ఓ మహిళ అంగీకరించిందని చెప్పారు. ఆమె ద్వారా బిడ్డ పుట్టేలా చేసి అప్పగిస్తామని తెలిపారు. చెప్పినట్టుగానే తొమ్మిది నెలల తరువాత వైజాగ్ పిలిపించి మగబిడ్డ పుట్టాడని గోవింద్ సింగ్ దంపతులకు అప్పగించారు. ఆ తరువాత జరిపించిన డీఎన్ఏ పరీక్షల్లో తమకు పుట్టిన బిడ్డ కాదని నిర్ధారణ కావటంతో గోవింద్ సింగ్ దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ నమ్రతతోపాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ, కళ్యాణీ తదితరులను అరెస్ట్ చేశారు. కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉన్నందున డాక్టర్ నమ్రత, జయంత్ కృష్ణ, కళ్యాణీ, ధనసరి సంతోషిని కస్టడీకి అనుమతించాలంటూ సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు డాక్టర్ నమ్రతను అయిదు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం పోలీసులు చంచల్ గూడ మహిళా జైలుకు వెళ్లి డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు.
Also Read- Sheep Distribution Scam: గొర్రెల స్కీంలో వెయ్యి కోట్లను బెట్టింగ్యాప్ ఖాతాలకు మల్లింపు
కళ్యాణీకే తెలుసు…
అనంతరం నార్త్ జోన్ డీసీపీకి ఆమెను తరలించి విచారణ ప్రారంభించారు. సరోగసీ పేర మరొకరికి పుట్టిన బిడ్డను గోవింద్ సింగ్ దంపతులకు అప్పగించిన విషయం వాస్తవమా? కాదా? అని ప్రశ్నించగా.. ఆ వివరాలు ఏవీ తనకు తెలియదని డాక్టర్ నమ్రత చెప్పినట్టు తెలిసింది. వైజాగ్ బ్రాంచ్లో అత్యున్నత సదుపాయాలు ఉండటంతో గోవింద్ సింగ్ దంపతులను తాను అక్కడికి పంపించానని జవాబిచ్చినట్టు సమాచారం. ఆ బ్రాంచ్కు ఇన్ ఛార్జ్గా ఉన్న కళ్యాణీ బిడ్డ కోసం వచ్చిన గోవింద్ సింగ్ దంపతులతో మాట్లాడిందని సమాధానమిచ్చినట్టు తెలిసింది. శిశువును గోవింద్ సింగ్ దంపతులకు అప్పగించింది కూడా కళ్యాణీయే అని చెప్పినట్టుగా సమాచారం. అస్సాం దంపతుల నుంచి బిడ్డను కొన్న విషయం గురించి ప్రశ్నించినా.. డాక్టర్ నమ్రత తనకేమీ తెలియదనే సమాధానమిచ్చినట్టుగా తెలియవచ్చింది. శిశువును కొనటంలో ఏజెంట్లుగా వ్యవహరించిన సంజయ్, నందిని గురించి అడిగితే వాళ్లతో తనకు పరిచయం కూడా లేదని చెప్పినట్టుగా సమాచారం. అస్సాం మహిళకు ప్రసవం కూడా వైజాగ్లోనే జరిగిందని జవాబిచ్చినట్టు తెలియవచ్చింది. ఇంతకు ముందు సరోగసీ పేర ఇతరులకు పుట్టిన బిడ్డలను ఎంతమందికి అప్పగించారు? అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయినట్టుగా తెలిసింది. యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేంద్రానికి అనుమతులు రద్దయిన తర్వాత మరో డాక్టర్ పేర ఎందుకు నడుపుతున్నారు? అన్న ప్రశ్నకు కూడా ఆమె సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని తెలియవచ్చింది. గతంలో తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదయ్యాయని మాత్రం అన్నట్టుగా సమాచారం. సంతానం కోసం వచ్చిన వారి వివరాలతో రికార్డులు మెయింటైన్ చేస్తున్నారా? చేస్తే.. ఆ రికార్డులు ఎక్కడ ఉన్నాయి? అని అడిగినపుడు అదంతా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ చూసుకునే వారని చెప్పినట్టుగా తెలిసింది. సరోగసీ పేర ఇప్పటివరకు ఎంతమందికి పిల్లలను అందించారని అడిగితే.. అలాంటి పనులు చేయలేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. పిల్లలను ఇచ్చినందుకు ఒక్కొక్కరి నుంచి ఎంతెంత డబ్బు వసూలు చేశారని అడిగితే మౌనంగా ఉండిపోయినట్టు సమాచారం. ఇక, అడ్వకేట్ నంటూ డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ కొంతమందిని బెదిరించినట్టుగా ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దీని గురించి అడిగితే తన కొడుకు ఎవ్వరినీ బెదిరించ లేదని అన్నట్టుగా తెలిసింది. అయిదు గంటలకు పైగా విచారించిన అనంతరం పోలీసులు డాక్టర్ నమ్రతను నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ నుంచి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు.
కావాలనే ఇరికించారు…
వైద్య పరీక్షలు జరిపించటానికి డాక్టర్ నమ్రతను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చినపుడు ఆమె మీడియాతో మాట్లాడింది. పోలీసులు కావాలనే తనను ఈ కేసులో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పింది. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని పేర్కొంది. అజయ్ కళ్లం, సీతారామాంజనేయులు తనపై అభియోగాలు చేస్తున్నారని ఆరోపించింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు