Phone Tapping Case: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao)కు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. ఇవాళ ఉదయం 11 గంటలలోపు కేసు విచారణ చేస్తున్న సిట్ ఎదుట లొంగిపోవాలంటూ ఆయనకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన వివరాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
అలా వెలుగులోకి
క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న వారి మొబైల్ ఫోన్లను ట్యాప్ చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకే ఫోన్ ట్యాపింగ్ బాగోతం వెలుగు చూసింది. దీని వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక నేతల పాత్ర ఉన్నట్టుగా బలమైన ఆరోపణలు వచ్చాయి.
దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దీనిపై సిట్ విచారణకు ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ముందుగా ఈ కేసులో ఎస్ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్ రావును అరెస్ట్ చేసింది. ఆయనను జరిపిన విచారణలో వెల్లడైన వివరాల మేరకు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని ప్రశ్నించిన నేపథ్యంలో వెలుగు చూసిన సమాచారంతో బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబీకి ఛీఫ్గా పని చేసిన ప్రభాకర్ రావును కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఓ ఛానల్ యజమాని శ్రవణ్ రావును కూడా నిందితుడిగా పేర్కొన్నారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర రావుకు బిగ్ షాక్.. సుప్రీం కీలక ఆదేశాలు
అమెరికా జంప్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా వాటిని పట్టించుకోలేదు. పైగా, రాజకీయ కారణాలతో తనను వేధిస్తున్నారని, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తనకు పౌరసత్వాన్ని ఇవ్వాలని అమెరికా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దాంతో దర్యాప్తు అధికారులు ప్రభాకర్ రావు పాస్ పోర్టును రద్దు చేయించారు. సీబీఐ ద్వారా అతడి పేరు మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించారు. ఇంటర్ పోల్ సహాయంతో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దాంతో తప్పనిసరై ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే, ఇక్కడకు రావడానికి ముందు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని, ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర రక్షణ కల్పించింది. అదే సమయంలో సిట్ విచారణకు పూర్తిగా సహకరించాలంటూ ప్రభాకర్ రావును ఆదేశించింది.
సహకరించని ప్రభాకర్ రావు
సిట్ అధికారులు పలుమార్లు ప్రభాకర్ రావును విచారణకు పిలిపించారు. అయితే, ఎన్ని రకాలుగా ప్రశ్నించినా కేసులోని కీలక వివరాలను వెల్లడించలేదు. పైగా, ఫోన్ ట్యాపింగ్ సమయంలో ఉపయోగించిన డిజిటల్ పరికరాల్లోని డేటాను డిలీట్ చేశారు. మొబైల్ ఫోన్లు మాయం చేశారు. ఐ క్లౌడ్ అకౌంట్ పాస్ వర్డ్ కూడా ఇవ్వలేదు.
సుప్రీంకు వెళ్లిన ప్రభుత్వం
ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదంటూ సుప్రీంకోర్టులో కొంతకాలం క్రితం ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఆయనకు కల్పించిన మధ్యంతర రక్షణను ఉపసంహరించాలంటూ అందులో కోరింది. దీనిపై సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో ఐ క్లౌడ్ అకౌంట్ పాస్ వర్డ్ ఇవ్వడంతోపాటు విచారణకు సహకరించాలని ప్రభాకర్ రావును మరోసారి ఆదేశించింది. గురువారం దీనిపై మరోసారి విచారణ జరిగిన సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ అకౌంట్ పాస్ వర్డ్ ఇవ్వలేదని తెలిపారు. కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా మౌనం వహిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కల్పించిన మధ్యంతర రక్షణను ఉపసంహరిస్తూ నేడు ఉదయం 11 గంటలలోపు సిట్ ఎదుట సరెండర్ కావాలంటూ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈసారి నోరు తెరిచే అవకాశం?
సుప్రీంకోర్టు సరెండర్ కావాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నేటి నుంచి జరగబోయే విచారణలో ప్రభాకర్ రావు నోరు తెరిచే అవకాశాలు ఉన్నట్టుగా పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకు ముందు సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర రక్షణ ఉండడం, కొన్ని గంటలపాటు మాత్రమే విచారించి తిరిగి పంపించి వేసిన నేపథ్యంలో ప్రభాకర్ రావు కీలక సమాచారాన్ని వెల్లడించ లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులతో ప్రభాకర్ రావుకు ఆ వెసులుబాటు ఉండదని తెలిపాయి. అతడిని సిట్ అధికారులు తమ నిర్బంధంలోనే పెట్టుకుని ప్రశ్నిస్తారని పేర్కొన్నాయి. దాంతో ఆయన నోరు తెరవక తప్పదని అంటున్నాయి. అదే జరిగితే ఈ కేసులో సంచలన వివరాలు వెలుగు చూస్తాయని కూడా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక నేతలు ఎవరు అనేది కూడా బయట పడవచ్చని అంటున్నాయి. ఆ నాయకుల పేర్లు బయటకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం తప్పదని వ్యాఖ్యానించాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసు టైం లైన్
– మే 29న మూడు రోజుల్లో భారత్కు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
– తాత్కాలిక పాస్ పోర్టుపై తిరిగి వచ్చిన ప్రభాకర్ రావు
– మొదటిసారి జూన్ 9న సిట్ విచారణకు హాజరు
– జూన్ 11, 15, 17, 19, 20వ తేదీల్లో సిట్ అధికారుల ఎదుట హాజరు
– దర్యాప్తు చేస్తున్న సమయంలో విచారణాధికారులకే వార్నింగ్ ఇచ్చిన ప్రభాకర్ రావు. అన్ని రోజులు మీవే కావు, మాకూ టైమ్ వస్తుందని హెచ్చరిక
– కేసులో 270 మంది బాధితుల వాంగ్మూలాల నమోదు
బాధితులు వీరే
కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, టీఆర్ఎంఈఎస్ ఛైర్మన్ ఫయీముద్దీన్, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి, గద్వాల్ జడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య, ఎమ్మెల్సీ కవిత పీఏ, డ్రైవర్, పనిమనిషి చక్రధర్ గౌడ్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు, మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డితోపాటు పలువురు జర్నలిస్టుల నుంచి సిట్ అధికారులు స్టేట్మెంట్లు తీసుకున్నారు.
నిందితులు వీరే
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఏ2గా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఏ3గా ఎస్ఐబీ మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, ఏ4గా మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న, ఏ5గా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఏ6గా ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఉన్నారు. వీరిలో ప్రభాకర్ రావు మినహా మిగితా వారందరినీ సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఆ తరువాత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఇక, ప్రభాకర్ రావు పాత్రపై సిట్ అధికారులు కోర్టుకు 68 పేజీల ఛార్జిషీట్ను సమర్పించారు.

