తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: SC on TG Govt: గవర్నర్ నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోయినా విచారణను ఆపేది లేదని పేర్కొన్నది. తదుపరి విచారణను ఏప్రెల్ 24 వ తేదీకి వాయిదా వేసింది. నామినేటెడ్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారాయణ పేర్లను అప్పటి మంత్రివర్గం ఆమోదించి రాజ్భవన్కు పంపిందని, కానీ గవర్నర్ వాటిని వివిధ కారణాలతో పెండింగ్లో పెట్టారని పేర్కొంటూ వారిద్దరూ వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గవర్నర్ ఆమోదం తెలపకుండా తాత్సారం చేశారని, ఈ లోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ ఫైల్ను వెనక్కు తీసుకోవడంతో తమకు అన్యాయం జరిగిందని ఆ పిటిషన్లలో వీరు పేర్కొన్నారు. ఒకవైపు న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే గవర్నర్ కోటాలో ముగ్గురిని ఎమ్మెల్సీల నియామకం జరిగిందని పిటషనర్ల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.
గతంలో జరిగిన విచారణ సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు తుది తీర్పునకు అనుగుణంగానే ఈ ముగ్గురి నియామకం ఉంటుందని స్పష్టత ఇచ్చామని, ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించామని ధర్మాసనం తాజా విచారణ సందర్భంగా గుర్తుచేసింది.
Also Read: TG on Tax Evasion: పన్నుల ఎగవేతపై సర్కార్ సీరియస్.. పెద్ద ప్లాన్ రెడీ.
ఈ పిటిషన్లను జస్టిస్ విక్రమ్నాధ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించి, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సింధిగా గత విచారణ సందర్భంగా చెప్పినా ప్రభుత్వం నుంచి అందలేదని, ఈసారి రెండు వారాల వ్యవధిలో దాఖలు చేయాల్సిందేనని, ఒకవేళ సమర్పించకపోతే మరోసారి గడువు ఇవ్వబోమని, విచారణను చేపడతామని స్పష్టం చేసి తదుపరి విచారణను ఏప్రిల్ 24 కు వాయిదా వేసింది.
నేను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే : మహిపాల్రెడ్డి
పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో భాగంగా గూడెం మహిపాల్రెడ్డి సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ బీ-ఫామ్ మీద గెలిచిన తాను ఇప్పటికీ ఆ పార్టీలోనే ఉన్నానని, విడిచి వెళ్ళలేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో తెలిపారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగానే కలిశానని, కానీ పార్టీ పార్టీ మారినట్లు వచ్చిన కథనాలు నిరాధారమైనవన్నారు. ఆ కథనాల ఆధారంగా అనర్హత వేటు వేసేలా పిటిషన్ దాఖలైందని పేర్కొన్నారు.
కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మందికి నోటీసులు జారీ కావడంతో వాటికి వివరణ ఇచ్చేందుకు ఈ అఫిడవిట్ను పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్కు తోడు సహచర ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సైతం తనపై అనర్హత వేటు వేసేలా పిటిషన్ దాఖలు చేయడానికి మీడియాలో వచ్చిన కథనాలే కారణమని పేర్కొన్నారు. అసెంబ్లీకి ఎన్నికైనప్పటి నుంచి బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
గతేడాది జులై 15 న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో కలిశానని, ఇది పూర్తిగా వ్యక్తిగత హోదాలో మర్యాదపూర్వకంగా కలిశానని వివరించారు. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదా పార్టీ మారే ఉద్దేశం లేదన్నారు. బీఆర్ఎస్ను వడలేదని, వేరే పార్టీలో చేరలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపు అంశం వర్తిందని, అనర్హత వేటువేసే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.
Also Read: CM Revanth Reddy: ఇది రేవంత్ సర్కార్.. ప్రతీ నిర్ణయం ఓ సంచలనమే!