SLBC Rescue: ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో నుంచి మృతదేహాల వెలకితీత కోసం ఇటీవల రోబోలను కూడా రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే పలు సాంకేతిక సమస్యలతో రోబో రెస్క్యూకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. దీంతో రెస్క్యూకి మరింత సమయం పట్టేలా కనిపిస్తున్నది. ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ మిషన్ శిథిలాల తొలగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. సొరంగంలోని 14వ కిలోమీటరు వద్ద ప్రమాదం జరుగగా ప్రస్తుతం 13. 5 కి.మీ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చివరి 50 మీటర్ల వద్దే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి క్యాడవర్ డాగ్స్ ను రంగంలోకి దింపనున్నట్లు అధికారులు చెప్పారు.
క్యాడవర్ డాగ్స్..
ఇవో ప్రత్యేక రకం శునకాలు. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను సైతం పసిగట్టగలవు. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాద తీవ్రత దృష్ట్యా కొద్దిరోజుల ముందు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను తీసుకువచ్చారు. ఆ ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి.
సొరంగంలో మనిషి ఆనవాళ్లను కుక్కలు కనిపెట్టగలిగాయి. దాంతో రెస్క్యూ ఆపరేషన్ మొదలైన 16 రోజుల తర్వాత ఒక మృతదేహాన్ని వెలికి తీయగలిగారు. డీ2 పాయింట్ దగ్గర జాగిలాలు టీబీఏం ఆపరేటర్ చెయ్యిని గుర్తించాయి. అయితే మిగతా మృతదేహాలు కూడా అదే ప్రాంతంలో ఉంటాయనే అంచనాతో సహాయక బృందాలను రంగంలోకి దింపాయి. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరొక్కసారి మరోసారి క్యాడవర్ డాగ్స్ ను రంగలో దింపనున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఫిభ్రవరి 22వ తేదీన ఎస్ఎల్భీసీ టన్నెల్ పై కప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో టన్నెల్ లో 40 మంది ఉండగా 32 మంది బయటపడ్డారు. సొరంగం 14వ కిమీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. టన్నెల్ ను తవ్వుతున్న బోరింగ్ మిషన్ కూలడంతో అక్కడ ఉన్న ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. అప్పటి నుంచి వివిధ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా, మృతదేహాల గాలింపు కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే రెస్క్యూ టీంకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. సొరంగంలో పెద్ద ఎత్తున నీరు ఉరుతుండటం, భారీగా బురద పేరుకుపోవడంతో రెస్క్యూకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మరోపక్క లోపల నుంచి వ్యర్థాలు తీసుకెళ్లే కన్వేయర బెల్టు కూడా పాడవడంతో రెస్క్యూ కష్టతరంగా మారింది. కన్వేయర్ బెల్టును పునురుద్ధరించినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ లాభం లేదు. దాంతో రోబోల సహాయం తీసుకున్నారు.
టన్నెల్ లోకి రోబోలు వస్తే రెస్క్యూ వేగవంతమవుతుందని అందరూ భావించారు. కానీ దానికి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రెస్క్యూ మరింత ఆలస్యమవనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యంత్రానికి సమస్యలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆశలన్నీ క్యాడవర్ డాగ్స్ పైనే పెట్టుకున్నారు అధికారులు. మరోసారి శునకాలను రంగంలోకి దింపి టీబీఎం ఆపరేటన్ మృతదేహం లభించిన ఏరియాలో గాలించనున్నారు. కాగా, ఎన్నో ఆశలు పెట్టుకున్న రోబోలు మొరాయించడంతో కుక్కలైనా మిగిలిన ఏడు డెడ్ బాడీలను గుర్తించి రెస్క్యూ ముగిసిపోవాలని అందరూ కోరుకుంటున్నారు.