Sangareddy police: సంగారెడ్డి జిల్లాలో భారీ గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎస్-న్యాబ్, బిడిఎల్-భానూర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో సుమారు 64 లక్షల విలువ గల 128 కిలోల నిషేదిత ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు అంతర్ రాష్ట్ర అక్రమ రవాణాదారులను అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటి ఎక్స్ రోడ్డు వద్ద బిడిఎల్-భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, సంగారెడ్డి జిల్లా ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్ సిబ్బందితో కలిసి ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశానుసారం హైదరాబాద్ వైపు నుండి ముత్తంగి వైపు సర్వీస్ రోడ్డు పై వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు నెంబర్ MH 02 CL 4145, మహీంద్రా బొల్లేరో కారు OR 02 AM 5025 ను ఆపి తనిఖీ చేయగా 55-ప్యాకెట్ల ఎండు గంజాయిని గుర్తించారు. జరిగింది. దాని విలువ సుమారు 64 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నలుగురు నిందితులను, 128 కిలోల ఎండు గంజాయిని, కారు, బొలెరో వాహనంతో పాటు ఐదు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్లు చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలోని సరఫరాదారు రాజ్ కుమార్ వద్ద నుంచి గంజాయి తెచ్చి, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, మలేగావ్ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. ఫిరోజ్ అహ్మద్ కలీమ్ అహ్మద్, మలేగావ్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం, సగర్ నాయక్ సగర్, గజపతి జిల్లా, ఒడిశా, మెహబూబ్ అబ్దుల్ అహద్ అంసారీ, మలేగావ్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రం, మహ్మద్ ఇర్ఫాన్ మహ్మద్ అక్ఱమ్ ఇర్ఫాన్, మలేగావ్, నాసిక్ జిల్లా, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామన్నారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసు శాఖ ఉక్కు పాదం మోపడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి, మాదక ద్రవ్యాలను సాగు, సరఫరా చేసిన సంగారెడ్డి జిల్లా S-Nab నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇట్టి కేసు చేదనలో కీలకంగా వ్యవహరించిన బిడిఎల్-భానూర్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఎస్ఐ వెంకటేశం, సంగారెడ్డి జిల్లా ఎస్-న్యాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్ సిబ్బంది, క్లూస్ టీం సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
