Rajalingamurthy | మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసు వేసిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య సంచలనం రేపుతోంది. కాళేశ్వరం (kaleshwaram) అవినీతిపై ఆయన గతంలో కేసీఆర్, హరీష్ రావు (harish rao)లపై కేసులు వేసి పోరాడారు. ఆ కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. దానికి ఒకరోజు ముందు ఆయన్ను హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే రాజలింగమూర్తి హత్యకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదని ఆయన తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. త్వరలోనే ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకోవాలంటే సీఐడీకి అప్పగించాల్సిందే అని ఆలోచిస్తున్నారంట. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సమయంలో అందరికంటే మొట్టమొదట కేసులు వేసింది ఈ రాజలింగమూర్తినే. భూపాలపల్లి సెషన్స్ కోర్టులో కేసు వేసిన ఆయన.. ఆ తర్వాత హైకోర్టులో కూడా పోరాడారు. ఈ కేసుపై ఇంకా విచారణ జరుగుతున్న సమయంలోనే… నిన్న ఆయన్ను కొందరు నడిరోడ్డుపై నరికి హత్య చేశారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజలింగమూర్తి భార్య ఈ విషయంలో సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తన భర్తను బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించారంటూ ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ కేసులో నిజానిజాలు బయట పెట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.