Travel Advice:
గద్వాల,స్వేచ్ఛ: సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది తమ స్వగ్రామాలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకుని, అప్రమత్తంగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా (Travel Advice) ఎస్పీ టీ. శ్రీనివాసరావు హెచ్చరించారు. సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో గస్తీని మరింత పటిష్టం చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు కూడా పోలీసులకు సహకరించి భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.
గద్వాల జిల్లా పోలీసుల సూచనలివే..
గద్వాల జిల్లాలోని కాలనీవాసులు, ఇళ్లు, షాపులు, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాస రావు సూచించారు. ‘‘ ఇంట్లో లేని సమయంలో నమ్మకమైన ఇరుగు – పొరుగు వారిని ఇంటిని గమనించమని చెప్పండి. విలువైన వస్తువులను ద్విచక్ర వాహనాల, కార్ల డిక్కీలలో వదిలి వెళ్లకండి. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలపరాదు. బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా మీతో పాటు తీసుకెళ్లాలి. ఇంటికి లాక్ వేసిన తర్వాత తాళం బయటకు కనబడకుండా కర్టెన్ వేయాలి. గేటుకు తాళం వేసి ఉన్న ఇళ్లలోనే దొంగలు పడే అవకాశం ఎక్కువ ఉంది. ఊర్లకు వెళ్లేవారు ఇంట్లో ఒక గదిలో లైట్ వెలిగించి ఉంచడం మంచిది. ఇంటి ముందు పత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూడాలి. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. దీని వల్ల బయట వ్యక్తులకు ఈ ఇంట్లో మనుషులు ఉన్నట్లు అనిపిస్తుంది. విలువైన వస్తువులు, ఆర్థిక విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. వాహనాలకు హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ తప్పనిసరిగా వేయాలి’’ అని తెలిపారు.
బంగారు నగలు ఇంట్లో ఉంచొద్దు
ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవడం ఉత్తమమని ఎస్పీ శ్రీనివాస రావు సూచించారు. ‘‘టైమర్ ఉన్న లైట్లను ఇంట్లో అమర్చుకోవచ్చు. ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్, లేదా నాణ్యమైన సెక్యూరిటీ లాక్ వాడాలి. సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పరిశీలించాలి, డీవీఆర్ను రహస్య ప్రదేశంలో ఉంచాలి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా చూడవచ్చు. దృఢమైన తలుపులు, నాణ్యమైన గ్రిల్స్తో రెండంచెల భద్రత ఏర్పాటు చేసుకోవాలి. కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అనుమానితుల కదలికలను వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ప్రజలు పోలీస్ గస్తీకి సహకరించాలి. లోకల్ ఎస్ఐ, నంబర్ దగ్గర ఉంచుకోవాలి. ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. నమ్మకమైన వాచ్మెన్, లేదా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలి. అపార్టుమెంట్లలో కొత్తవారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలి. సోషల్ మీడియాలో మీ ప్రయాణ వివరాలు షేర్ చేయకపోవడం మంచిది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు మీ చిరునామా, ఫోన్ నంబర్ను పోలీస్ స్టేషన్కు తెలియజేయాలి. అనుమానాస్పద కదలికలపై డయల్ 100, లేదా మీ సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి’’ అని ఎస్పీ శ్రీనివాస రావు సూచించారు.
Read Also- KTR: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం: కేటీఆర్

