Phone Tapping Case: ట్యాపింగ్ కోసం ఫోన్ నెంబర్లు మీరే ఇచ్చారా?.. ఇస్తే ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చారు? ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అధికారులతో అన్నిసార్లు ఫోన్ లో ఎందుకు మాట్లాడారు?.. విశ్వసనీ యవర్గాల ద్వారా తెలిసిన ప్రకారం బీఆర్ఎస్ రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావును సిట్ అడిగిన ప్రశ్నలివి. అయితే, కీలక ప్రశ్నలకు సంతోష్ రావు సమాధానాలు దాట వేసినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ తో తనకెలాంటి సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. ఇన్ ఛార్జ్ గా హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ నియమితులైన తరువాత సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తులో స్పీడ్ పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను వరుసగా రెండు రోజులపాటు పిలిపించి సుధీర్ఘంగా ప్రశ్నించారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మీ వద్ద సమాచారం ఉన్నట్టు తెలిసిన నేపథ్యంలో వివరాలు తెలుసుకోవటానికి విచారణకు పిలుస్తున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు రావాలని సూచించారు.
సరిగ్గా టైముకు..
ఈ నేపథ్యంలో సంతోష్ రావు మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతోపాటు కస్టడీకి తీసుకుని జరిపిన విచారణలో ఎస్ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు చెప్పిన వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను ముందు పెట్టుకుని సిట్ అధికారులు సంతోష్ రావును ప్రశ్నించినట్టుగా తెలిసింది. ట్యాపింగ్ కోసం కొన్ని ఫోన్ నెంబర్లను చీటీలపై రాసి పంపించటంతోపాటు వాట్సాప్ ద్వారా మీరే అందచేశారని తెలిసింది. ఇది నిజమేనా? అని అడిగినట్టు సమాచారం. నిజమే అయితే ఎవరి సూచనల మేరకు ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ కోసం ఇచ్చారు? అని అడిగినట్టుగా తెలిసింది.
Also Read: Dog Guards Dead Body: మంచులో చనిపోయిన యజమాని.. డెడ్బాడీకి 4 రోజులు కాపలా కాసిన పెంపుడు శునకం
దీంట్లో మీ పాత్ర ఏమిటి?
దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అధికారులతో మీరు ఫోన్లలో మాట్లాడినట్టుగా ఆధారాలు ఉన్నాయి…వారితో ఏం మాట్లాడారు? అని కూడా ప్రశ్నించినట్టు సమాచారం. అసలు వారితో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అని కూడా అడిగినట్టు తెలిసింది. ఇదే కేసులో నిందితునిగా ఉన్న ఓ ఛానల్ యజమాని శ్రవణ్ రావుతో కూడా పలుమార్లు మాట్లాడినట్టుగా వివరాలు ఉన్నాయి…దేని గురించి మాట్లాడుకునే వారు? అని ప్రశ్నించినట్టుగా తెలియవచ్చింది. రిటైరైన తరువాత ప్రభాకర్ రావును తిరిగి ఎస్ఐబీ ఛీఫ్ గా నియమించారు. దీంట్లో మీ పాత్ర ఏమిటి? అని సిట్ అధికారులు సంతోష్ రావును అడిగినట్టుగా సమాచారం. పదవీ విరమణ తరువాత ప్రభాకర్ రావును ఎస్ఐబీ ఛీఫ్ గా నియమించాలన్న నిర్ణయం ఎవరిది? అని కూడా ప్రశ్నించినట్టుగా తెలిసింది. అయితే, చాలా ప్రశ్నలకు సంతోష్ రావు మౌనంగా ఉండిపోయినట్టుగా తెలియవచ్చింది. ఫోన్ ట్యాపింగ్ తో తనకెలాంటి సంబంధం లేదని జవాబు ఇచ్చినట్టు సమాచారం. ట్యాపింగ్ చేయాలని తాను ఎలాంటి నెంబర్లు ఇవ్వలేదని చెప్పినట్టుగా తెలిసింది.
నెక్స్ట్ కేసీఆరా?…కవితనా?..
ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన సిట్ అధికారులు త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు జాగృతి అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త అనిల్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే, ముందుగా కేసీఆర్ ను పిలుస్తారా? కవిత…ఆమె భర్తను పిలుస్తారా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఈ కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ ఆడియో టేపులను మీడియా సమావేశంలో వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనను ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టు తెలియవచ్చింది. ఆ ఆడియో టేపులు ఎలా అందాయి? ఎవరు ఇచ్చారు? అన్న అంశాలపై ప్రశ్నించాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇక, బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన తరువాత కవిత పలుమార్లు తన ఫోన్ తోపాటు తన భర్త ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత, ఆమె భర్తను కూడా పిలిపించి ఫోన్ ట్యాపింగ్ గురించి ఏయే విషయాలు తెలుసు? అన్న దానిపై విచారణ చేయాలని సిట్ అధికారులు అనుకుంటున్నట్టుగా తెలియవచ్చింది.
Also Read: Mega Twins: మెగా వారసులు వచ్చేందుకు డేట్ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

