Indiramma Houses: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతుందని, ఇప్పటికే 1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy)తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను కూడా అందజేశామన్నారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై (Indiramma Houses) అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రూ. 22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 23 వరకు గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) (జీహెచ్ఎంసీ) మినహా రాష్ట్రంలోని 95 నియోజకవర్గాలకుగాను 88 నియోజకవర్గాలలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వర్షాకాల సీజన్ను దృష్టిలో ఉంచుకొని, గ్రౌండింగ్ అయిన ఇళ్ల బేస్మెంట్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకునేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్లో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్, సిద్దిపేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని, తక్షణమే ఆయా జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Rowdy-Sheeters: హైదరాబాద్లో సెటిల్మెంట్ల పేర దండిగా వసూల్లు!
ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక..
ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణానికి ప్రభుత్వం ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తుందని, లబ్ధిదారులు దీనిని పొందేలా క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, పనుల పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు జరుపుతున్నామని వివరించారు. మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కారం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ చేస్తున్నామన్నారు.
బేస్మెంట్ పూర్తయిన తర్వాత రూ. లక్ష, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత రూ. 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత రూ. లక్ష విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇంటి స్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించని 2బీహెచ్కే ఇళ్లను కేటాయించాలని మంత్రి ఆదేశించారు. అలాగే, మొండి గోడలతో అసంపూర్తిగా ఉన్న 2బీహెచ్కే ఇళ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో, లబ్ధిదారులే పూర్తి చేసుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందిస్తుందన్నారు. ప్రధానంగా 2బీహెచ్కే అసంపూర్తిగా ఉన్న జీహెచ్ఎంసీ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
Also Read: CM Revanth Reddy: కల్వకుంట్ల ఫ్యామిలీకి వేల కోట్లు ఎక్కడివి?.. సీఎం సంచలన కామెంట్స్!