National Health Mission: నేషనల్ హెల్త్ మిషన్ లోని ఉన్నతాధికారులు చేస్తున్న నిర్లక్ష్యానికి కింది స్థాయి ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఎన్ హెచ్ ఎం విభాగం శాలరీలకు సంబంధించిన ఫైల్ ను ఇప్పటి వరకు మూవ్ చేయలేదు. పూర్థి స్థాయి వివరాలతో ఫైల్ ను రెడీ చేసి, ఎన్ హెచ్ ఎం ఆఫీస్ లోనే ఉంచడం గమనార్హం.సదరు ఫైల్ ను హెల్త్ సెక్రటరీకి పంపించేందుకు ఎన్ హెచ్ ఎం విభాగంలో పనిచేసే కొందరు ఉద్యోగులు జంకుతున్నట్లు సమాచారం. ఆ ఫైల్ సెక్రటరీ వద్దకు వెళ్తే, మిషన్ అలవెన్స్ ముచ్చట బయట పడుతుందని, భారీ స్థాయిలో ఉన్న అలవెన్స్ కు సెక్రటరీ చెక్ పెట్టే ప్రమాదం ఉన్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ ఆఫీస్ లోనే చర్చ జరుగుతుంది. దీంతో ఆ ఫైల్ ను సెక్రటేరియట్ కు పంపించకుండా ఎన్ హెచ్ ఎం ఫైనాన్స్ విభాగంలో పెండింగ్ పెట్టారు.
జీతాలకు సంబంధించిన ఫైల్ను గతంలో సెక్రటరీ పేషీలో పనిచేసిన ఓ కీలక అధికారి కూడా చెక్ చేసి, అంతా ఒకే అంటూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. కానీ సదరు ఫైల్ ను హెల్త్ సెక్రటరీకి ఎందుకు పంపడం లేదనేది చర్చంశనీయమైనది. తద్వారా ఉద్యోగులకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు వేతనాలు రాకపోవడంతో ఎన్ హెచ్ ఎం విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా స్కూళ్ల ప్రారంభం సీజన్ కావడంతో పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ, ఇతరాత్ర ఖర్చుల నిమిత్తం ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. పెద్ద కేడర్ ఉద్యోగుల మేలు కోసం చిన్న కేడర్ ఉద్యోగులను పస్తులు ఉంచడం సరికాదని ఎన్ హెచ్ ఎం ఎంప్లాయీ ఒకరు తెలిపారు.
ట్రైనింగ్ లో కమిషనర్?
ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కు కొత్తగా కమిషనర్ గా నియమితులైన సంగీత సత్యానారాయణ డీవోపీటీ ట్రైనింగ్ నిమిత్తం ఢిల్లీలో ఉన్నారు. దీంతో ఆ బాధ్యతలను కూడా ప్రస్తుతం హెల్త్ సెక్రటరీ మానిటరింగ్ చేస్తున్నారు. ఎన్ హెచ్ ఎం విభాగపు ఫైళ్లన్నీ ఇప్పుడు హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తూ పరిశీలించాల్సి ఉంటుంది. ఆయా విభాగాల అధికారులు కూడా ఆమె వద్దకే ఫైళ్లు పంపాలి. అయితే మిగతా ఫైళ్లన్నీ హెల్త్ సెక్రటరీకి పంపిస్తున్న ఎన్ హెచ్ ఎం అధికారులు, జీతాల ఫైల్ ను మాత్రం సెక్రటరీకి పంపించడం లేదు. దీంతో పలువురు ఉద్యోగుల్లో అనుమానం రేకేత్తింది. పైగా ఈ నెల 17న కొత్త కమిషనర్ డ్యూటీలో చేరతారని, అప్పుడే ఫైల్ పెట్టాలని కొందరు అధికారులు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Also Read: TPCC Gajjela Kantham: కాళేశ్వరం అవినీతి.. తీహార్ జైలుకు కేసీఆర్ ఫ్యామిలీ.. కాంగ్రెస్ నేత
30 శాతం అలవెన్స్?
నేషనల్ హెల్త్ మిషన్ ప్రధాన కార్యాలయంలో వేర్వేరు విభాగాల నుంచి కొందరు అధికారులు ఫారెన్ డిప్యూటేషన్ సర్వీస్ పై (ఎఫ్ఎస్ డీ) పనిచేస్తున్నారు. అయితే ఆయా ఆఫీసర్లు ‘‘మిషన్ అలవెన్స్ ” తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీతానికి అదనంగా 30 శాతం చొప్పున క్లైయిమ్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం దాదాపు 15 నుంచి 20 మంది కీలక అధికారులు మిషన్ అలవెన్స్ పొందుతున్నట్లు సమాచారం. ఇప్పుడు శాలరీల ఫైల్ ను సెక్రటరీ చూస్తే ఇవన్నీ మిస్ అవుతాయనే భయంలో ఎన్ హెచ్ ఎం ఉన్నతాధికారులు ఉన్నారు. దీంతోనే ఆపుతున్నట్లు సమాచారం.
ఏడాదిన్నర తర్వాత మళ్లీ మొదటికి?
నేషనల్ హెల్త్ మిషన్ లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, పారమెడికల్ స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో దాదాపు 20 వేల మందికి పైనే పనిచేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో ఈ విభాగంలోని ఉద్యోగులకు ప్రతి మూడు నెలలకు ఓసారి జీతాలు వచ్చేవి. కొన్ని సార్లు ఆరు నెలల వరకు కూడా వెయిట్ చేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా ఈ విభాగాన్ని సమీక్షించి, శాలరీలను గ్రీన్ ఛానెల్ లో వచ్చేలా చొరవ చూపించారు. గతంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గా పనిచేసిన ఆర్ వీ కర్ణన్ జీతాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి, ప్రతీ నెల మిస్ కాకుండా జీతాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఆయన ఇటీవల జీహెచ్ ఎంసీ కమిషనర్ గా ట్రాన్స్ ఫర్ అయ్యారు. దీంతో ఈ నెల జీతాలు మళ్లీ పెండింగ్ పడ్డాయి. ఏడాదిన్నర తర్వాత మళ్లీ సీన్ మొదటికి వచ్చిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు వర్క్ ఆపితే అస్తవ్యస్తంగా మారిపోతుందని కొందరు ఆఫీసర్లు చెప్తున్నారు.
Also Read: Wild Breath: కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు.. డైలాగ్ మారింది బ్రో!
