తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Mulugu District: విత్తనం రైతు హక్కు అని, దానిని కాపాడే చర్యలను ప్రభుత్వం తీసుకోవాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ కోరింది. మహారాష్ట్ర ప్రభుత్వం విత్తన చట్టంను సవరించి నకిలీ విత్తనాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. సచివాలయంలో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారికి వినతిపత్రం అందజేసింది. ఇటీవల ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనాలతో తీవ్రంగా గిరిజన రైతులు నష్టపోయిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చింది.
ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో మొక్కజొన్న రైతులు తీవ్ర నష్టపోయారు. రైతు కమిషన్ నిజనిర్ధారణ కమిటీ వేసి క్షేత్ర స్థాయిలో పర్యటించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే నష్టపోయిన రైతులకు తగు నష్టపరిహారం చెల్లించే చర్యలను జిల్లా యాంత్రాంగం చేపట్టింది. ములుగులో జరిగిన సంఘటన విత్తన, మార్కెట్ చట్టాల లోపాలను ఎత్తిచూపుతున్నాయని కమిషన్ తన లేఖ ద్వారా స్పష్టం చేసింది.
Also Read: SC on Kancha Gachibowli: హెచ్సీయూ భూముల వివాదంపై సుప్రీంకోర్టు సీరియస్.. పనులపై స్టే విధింపు
ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ల చట్టాలకు చేసిన కొన్ని సవరణలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ మార్కెట్ల చట్టం, విత్తన చట్టంలో తేవాల్సిన మార్పులు చేయాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ల చట్టంలోని కాంట్రక్టు వ్యవసాయానికి సంబందించిన సెక్షన్ 11ఏ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్పు చేసి, కంపెనీలకు ఎలాంటి బాధ్యత లేకుండా ఆర్గనైజర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని మండిపడ్డారు.
ఇప్పుడు ఈ సెక్షన్ ను సవరించి 2005 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొనసాగించాలని సూచించారు. కేంద్రం చేసిన విత్తన చట్టంలో నకిలీ విత్తనాల తయారీ, అమ్మకాలు చేసే కంపెనీ లపై చర్యలు తీసుకోడానికి కఠిన తరమైన నిబంధనలు లేవు అన్నారు. రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యవసాయ శాఖ పేరును వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు భవానీ రెడ్డి, భూమి సునీల్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు ఉన్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/