Bunker Beds Scam: బంకర్ బెడ్స్లో రూ.100 కోట్ల స్కాం జరిగిందని ఎంఎస్ఎంఈలు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. షరతుల పేరుతో పెద్ద కాంట్రాక్టర్ తనకు తగినట్లుగా అన్నీ చేసుకుని చిన్న పరిశ్రమలకు అర్హత లేకుండా చేశారని ఆరోపించారు. నిబంధనలపై దర్యాప్తు చేస్తే నాలుగు కంపెనీలు అర్హత లేకున్నా సిండికేట్గా మారాయని తెలిపారు. మేఘా శ్రీనివాస్ రెడ్డి కుమారుడికి చెందిన తృఫా ఎంర్ప్రైజెస్, పూణే ఆధారిత క్లాత్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ మఫత్లాల్ ఇండస్ట్రీస్, 20 కోట్ల టర్నోవర్ కూడా లేని ట్రేడింగ్ కంపెనీ చింతామణి పర్శంత్ ఎంటర్ప్రైజెస్, ఏపీకి చెందిన 30 కోట్లకు మించని కంపెనీ అహల్దా ఇంజినీరింగ్స్ లిమిటెడ్, ఇండోర్ ఆధారిత బ్రాంచ్ కంపెనీ బాంటన్ టెక్నోమేక్ లిమిటెడ్ టెండర్స్కు అర్హత లేకున్నా పాల్గొని సిండికేట్గా మారాయని వివరించారు. అర్హత లేని రెండు కంపెనీలు మెథడాక్స్ ఎక్స్పీరియన్స్ చూపించి ఎల్1 అండ్ ఎల్2 గా అర్హత పొందాయని తెలిపారు. ఇది మొత్తం మేఘా కంపెనీ ప్లాన్ చేసి, ఆర్డర్ దక్కించుకునేందుకు చేసిన రూ.100 కోట్ల స్కామ్ అని స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. మళ్లీ సప్లమెంటర్ డీడ్తో ఎంట్రీ ఇచ్చి కాంప్రమైజ్ చేసుకునే పనిలో పడ్డారని చెప్పారు.
మేము రూ.15 వేలకే ఇస్తాం
బంకర్ బెడ్ను ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ రూ.15,000 కే సరఫరా చేయగలదు. కానీ, రూ.33,466 చొప్పున కొనుగోలు ఆర్డర్ రిలీజ్ చేయడంపై అభ్యంతరం తెలుపుతున్నారు. గత సంవత్సరం నుంచి కొత్త టెండర్లు పిలవడం లేదని, కొన్ని డిపార్ట్మెంట్లు జైళ్లకు అధిక ధరలతో ఆర్డర్లు ఇస్తున్నాయని, మరికొన్ని మాత్రం మేఘా కంపెనీలకే నేరుగా ఆర్డర్లు ఇస్తున్నాయని ఆరోపించారు. దీంతో ప్రభుత్వం ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీలను పట్టించుకోవడం లేదని అర్థం అవుతున్నదని విమర్శించారు. ప్రోత్సహించడం దేవుడు ఎరుగు రావాల్సిన 20 శాతం వాటా టెండర్స్ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల మంది ఫిట్టర్స్, వెల్డర్స్ పని లేక బైక్, క్యాబ్ డ్రైవర్స్గా వర్క్ చేస్తున్నారని వాపోతున్నారు.
Also Read: Bunker Beds: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. కేజీబీవీ విద్యార్థినులకు బంకర్ బెడ్లు
బకాయిలు పెండింగ్లోనే
మేఘా కంపెనీలకే ప్రాధాన్యం ఇచ్చి, వారికి మాత్రమే బిల్స్ రిలీజ్ చేయడంపైనా ఎంఎస్ఎంఈలు అభ్యంతరం చెబుతున్నారు. తమ ఇండస్ట్రీలకు సంబంధించి రూ.500 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని, పేమెంట్లు రాక బ్యాంకు వడ్డీలు కడుతూ కష్టంగా ఇండస్ట్రీలు నడపలేకపోతున్నామని చెబుతున్నారు. బంకర్ బెడ్ ఆర్డర్లు ప్రధాన రాజకీయ నాయకుల ఒత్తిడితో తృఫా అండ్ మఫత్లాల్ కంపెనీలకు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. తాము దీనిపై న్యాయస్థానంలో పోరాడుతున్నామని, విజిలెన్స్ విచారణ కూడా జరుగుతున్నదని చెప్పారు. అయినా కూడా ఇప్పటివరకు ఆర్డర్ రద్దు చేయలేదని తెలిపారు.
రాజీకి రాయబారాలు
అధికార పార్టీకి చెందిన ఒక ఆఫీషియల్ స్పోక్స్పర్సన్, ఎంఎస్ఎంఈలకు పని ఇప్పిస్తామని చెబుతూ, కేసు వెనక్కి తీసుకోమని తమ వద్దకు వచ్చారని పిటిషనర్స్ ‘స్వేచ్ఛ’కు తెలిపారు. తాజాగా ఆయన కూడా చేతులు ఎత్తేయడానికి కారణం తమ పేరుతో డీల్ చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వకుండా, పని ఇప్పించకుండా వెనుతిరిగారని విమర్శిస్తున్నారు.
మమ్మల్ని బతికించండి
‘మా వర్కర్ల యూనియన్లు పూర్తిగా ఉపాధి లేకుండా పోయింది. తిండి కోసం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. మేము ఎంఎస్ఎంఈ అసోసియేషన్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా ఇండస్ట్రీల సమస్యలను వెంటనే పరిశీలించండి. ఈ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నది. మా కార్మికులు కూడా తెలంగాణ మొత్తం ఉన్నారు. ఇది ఒక గ్రూప్ కాదు. లక్షల మంది కుటుంబాల జీవనాధారం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాం’ అని ఎంఎస్ఎంఈ అసోసియేషన్ పేర్కొంది.

