Kavitha on CM Revanth: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసాలపై చర్చిద్దామని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి.. చంద్రబాబు (CM Chandrababu)ను పిలిచి హైదరాబాద్ బిర్యాని (Hyderabad Biryani) పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చారని ఆరోపించారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదని.. రేవంత్ రెడ్డికి అబద్దాలు చెప్పడం అలవాటైందని విమర్శించారు. గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదని కవిత అన్నారు.
అలా చేస్తే.. కాంగ్రెస్ను క్షమించరు!
కేసీఆర్ దమ్ము ఏంటో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందుకే తెలంగాణ వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలన్న కవిత.. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరని ఆరోపించారు.
పోస్ట్ కార్డు ఉద్యమం
మహిళలకు రూ. 2500, పెన్షన్ల మొత్తాన్ని పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. హామీల అమలుకు డిమాండ్ చేస్తూ అబిడ్స్ జీపీవో నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పోస్ట్ కార్డ్ పంపారు. ఆమెతో పాటు తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) కార్యకర్తలు వందలాది కార్డులను పంపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కవిత ఆరోపించారు. వృద్ధులకు రూ 2 వేల పెన్షన్ ను రూ 4 వేలు చేస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని మండిపడ్డారు.
Also Read: TG Govt Schools: గుడ్ న్యూస్.. ప్రభుత్వ స్కూళ్లల్లో భారీగా పెరిగిన విద్యార్థులు.. ఎంతంటే?
రేవంత్కు సోనియా ఆదేశాలివ్వాలి!
వికలాంగుల పెన్షన్ ను రూ. 4 వేల నుంచి రూ. 6 వేల కు పెంచకుండా కాంగ్రెస్ (Congress) మోసం చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో గ్యారెంటీలపై సోనియా గాంధీ (Sonia Gandhi) సంతకం పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారని గుర్తుచేశారు. సోనియాగాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధులను, వికలాంగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించామని కవిత స్పష్టం చేశారు. పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని సోనియా గాంధీని కోరినట్లు పేర్కొన్నారు.