Thummala Nageswara Rao: ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను రైతులకు వివరించి, దీర్ఘకాలికంగా మట్టిసారాన్ని కాపాడుతూ ఖర్చులు తగ్గించే విధానాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. జిల్లా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు జనవరి మొదటి వారంలో మండలాల వారిగా పర్యటించి, రైతులకు అందుతున్న సబ్సిడీలు, యాంత్రీకరణ పథకం దరఖాస్తులు, యూరియా యాప్ అమలు తదితర అంశాలపై క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ సేకరించాలని సూచించారు.
ఒక్క పైసాను కూడా వృధా చేయకూడదు
రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణమే పరిష్కారాలు అందించాలన్నారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఒక్క పైసాను కూడా వృధా చేయకూడదనే ఆలోచనతో ఉన్నారని, అందుకోసం స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మేరకు ఇప్పటికే కేంద్ర పథకాల కోసం స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసి 400 కోట్లను వినియోగించడం జరిగిందని తెలియజేశారు. ఆయిల్ పామ్ వంటి దీర్ఘకాలిక ఆదాయం ఇచ్చే పంటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రైతులకు సబ్సిడీలు అందిస్తూ, ఆయిల్ పామ్ పంట విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇది రైతుల ఆదాయం పెంచడంలో కీలకంగా నిలుస్తుందన్నారు.
యూరియా యాప్ను అమలు చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. ఇప్పటికే ఐదు జిల్లాల్లో యూరియా యాప్ సమర్థవంతంగా అమలవుతోందని, రైతులు కూడా దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మాటలతో యాప్ అమలులో లేని జిల్లాలలోని రైతులు ఎక్కువగా యూరియా కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందని, యాప్ ద్వారా కూడా రైతులు తమకు కావాల్సినంత యూరియాను కొనుగోలు చేయొచ్చని, రైతులెవరు అనవసర భయాందోళనకు గురి కావద్దని మంత్రి కోరారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా యాప్ ను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రబీ సీజన్ రైతుభరోసా కోసం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ ను త్వరితగతిన పూర్తి చేసి, రైతుభరోసా నిధులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతులకు అండగా నిలిచేలా అన్ని పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Thummala Nageswara Rao: పసుపుకు జీఐ ట్యాగ్ రావడం మన రైతులకు గర్వకారణం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

