Minister Seethaka: ట్రాన్స్ జెండర్లకు సమాన అవకాశాలు కల్పించి వారిని కూడా సమాజంలో భాగం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క చెప్పారు. దీని కోసమే హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించినట్టు తెలిపారు. ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా వారికి అవకాశాలు కల్పించటానికి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాన్స్ జెండర్లకు సాధికారికత కల్పించేందుకుగాను పైలట్ ప్రాజెక్టుగా డిసెంబర్ లో 44మందిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించిన విషయం తెలిసిందే. ఆరునెలల తరువాత వీరి పని తీరు, ప్రవర్తన తదితర అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ క్రమంలో సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్లకు సమాన అవకాశాలు కల్పించటానికి తెలంగాణ తీసుకున్న నిర్ణయాన్ని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు కేంద్రం కూడా ఆదర్శంగా తీసుకుని ఈ దిశగా చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. అంగవైకల్య కోటా కింద ట్రాన్స్ జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు. జిల్లాల్లో ఇప్పటికే మైత్రీ క్లినిక్ లను ఏర్పాటు చేశామన్నారు. పైలట్ ప్రాజెక్ట్ నివేదికను అధ్యయనం చేసిన తరువాత ఇతర ప్రభుత్వ శాఖల్లో, జిల్లాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించటానికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
Also Read: GHMC officials: మళ్లీ మునక తప్పదా?.. పూడికతీత పనులపై అనుమానాలు ఎన్నో?
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పది రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేసి ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో 38మంది ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నట్టు చెప్పారు. గడిచిన ఆరు నెలల్లో వారిపై ఏ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగాలు చేయటానికి ముందుకొచ్చే వారికి సహకరిస్తామన్నారు.
ట్రాఫిక్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న ట్రాన్స్ జెండర్లు మాట్లాడుతూ తమకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. పోలీసు సిబ్బంది తమతో మర్యాదగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వారితో కలిసి పని చేయటం గౌరవంగా ఉందన్నారు. ఒకప్పుడు పోలీసులంటే భయం ఉండేదని, ఇప్పుడు వారితో కలిసి పని చేయటం సంతోషంగా ఉందని తెలిపారు. సమావేశంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, వికలాంగులు, సీనియర్ సిటిజెన్లు, ట్రాన్స్ జెండర్ల సాధికారతా విభాగం డైరెక్టర్ బీ.శైలజ, ట్రాన్స్ జెండర్ల ఎన్జీవో సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Also Read: Fake Documents: నకిలీ ఇండ్ల పట్టాల దందా.. రెచ్చిపోతున్న అక్రమార్కులు!