TS News: పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా మార్చాం
నగరంలో మరిన్ని రూట్లలో కొత్త ఆఫీసు బస్సులు ఏర్పాటు చేస్తాం
రేషన్ కార్డుల జారీ, అభివృద్ధి పనులు జూబ్లీహిల్స్ కోసం కాదు
సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతాయి
ప్రజలతో ముఖాముఖిలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా రాసి ఇస్తే, వారం రోజుల్లో పరిష్కరిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్లో (TS News) జయ ప్రకాష్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీ ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావులు ఆదివారం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రోడ్లు ,డ్రైనేజీలు పలు సమస్యలపై స్థానికులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
Read Also- IND vs PAK Match: ఆరంభంలో పాక్ను బెంబేలెత్తించిన పాండ్యా, బుమ్రా.. టాస్ సమయంలో ఊహించని సీన్లు
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇప్పటికే రోడ్లు ,డ్రైనేజీలను నిర్మించడానికి పెద్ద ఎత్తున శంకుస్థాపనలు జరుగుతున్నాయని వివరించారు. హైదరాబాదులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే కాదని, హైదరాబాద్ రాష్ట్ర రాజధాని బ్రాండ్ ఇమేజ్ కాపాడే విధంగా అన్ని సమస్యలు పరిష్కరించే ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పారు. సమస్యల పరిష్కారంలో జూబ్లీహిల్స్కి ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. డ్రైనేజీ వాటర్ ఫ్లో అవుతుందని, సమస్య తమ దృష్టికి రాగానే పరిష్కారానికి .40 లక్షలు మంజూరు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పనులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు.
1923లో నిజాం కాలంలో హిమాయత్ సాగర్, నిజాంసాగర్, తర్వాత సింగూరు, మంజీరా జలాలు కృష్ణ ఫేజ్- 1,2,3 ,గోదావరి ఫేజ్- 1 కి హైదరాబాద్కు తీసుకొచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకూ నగరానికి 630 ఎంఎల్డీ నీళ్లు వస్తున్నాయని వివరించారు. గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం చాలా పెరిగిందని, అవసరానికి తగిన విధంగా నగరానికి నీళ్లు తీసుకువచ్చే కార్యక్రమాలు ఏమీచేయలేదని విమర్శించారు.
Read Also- Ind vs Pak Match: పాకిస్థాన్తో మ్యాచ్లో నిరసనకు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్లు!
గతవారం గండిపేట వద్ద ముఖ్యమంత్రి చేతుల మీదుగా గోదావరి ఫేజ్ -2 ద్వారా 300 ఎంఎల్డీ వాటర్ను హైదరాబాద్కు తాగునీటి అవసరాల కోసం తీసుకురావడానికి రూ.7,300 కోట్లతో శంకుస్థాపన చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. మెట్రో రైలు పరిధి పెంచుకుంటున్నామని, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందుబాటులోకి తెచ్చామని, హైదరాబాదులో బస్సుల సంఖ్య పెంచుతున్నట్లు వివరించారు.
నగరంలో కొత్త రూట్లలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం వివరించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, రేషన్ కార్డులు జూబ్లీహిల్స్లో మాత్రమే కాదు ,తెలంగాణ మొత్తం పంపిణీ చేస్తున్నామన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని మంత్రి తుమ్మల గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సంగీత స్థానిక నాయకులు పాల్గొన్నారు.