Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ రంగంలోకి దిగారు. దేవాదాయ భూములపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆక్రమణకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల పర్యటనలు చేసి అధికారులతో సమీక్షతో పాటు కబ్జాకు గురైన భూములను సైతం ప్రత్యక్షంగా సందర్శించనున్నట్లు సమాచారం. దేవాదాయ శాఖ లీగల్ టీంను సైతం యాక్టివ్ చేసేలా మానిటరింగ్ చేయనున్నట్లు తెలిసింది. ఆలయ భూముల నివేదికను మరోసారి మంత్రి కోరినట్లు సమాచారం.
భూముల రక్షణకు కంచెలను సైతం వేగంగా ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయశాఖలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడంతో కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది ఈవోల అలసత్వం దేవుడి భూమికి శాపంగా మారింది. ఆలయ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఇంకా కొన్ని భూములను ఆలయ పూజారులే ఏకంగా భూములు అమ్మారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఇలాగే ఉంటే ఆలయ భూములు కనిపించకుండా పోయే అవకాశం లేకపోలేదు. ఆలయాల్లో ధూపదీపం నైవేద్యం కోసం ప్రభుత్వ భూములను కేటాయించారు.
Also Read: Teacher Eligibility Test: టెట్ అభ్యర్థులకు ‘పరీక్ష’ తప్పట్లేదు.. ఈనెల 18 నుంచి 30వరకు ఎగ్జామ్స్!
తెలంగాణలో ఆలయాలకు 87235.39ఎకరాలను కేటాయించినట్లు అధికారిక లెక్కలు ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ భూములపై కొరవడటంతో ఆ భూముల ఆక్రమణకు గురవుతున్నాయి. ఆలయాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఎకరం కాదు, రెండెకరాలు కాదు, ఏకంగా 20124.03 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. విత్ అవుట్ లిటిగేషన్తో మరో 5569.35 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు పేర్కొంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం చూపడం లేదు. మరో 6 ఎకరాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి.
కబ్జా భూములపై ఫోకస్
దేవాలయ భూములు అక్రమార్కుల చెరనుంచి వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏ ఆలయం కింద ఎంత భూమి ఆక్రమణకు గురైంది? ఎంతమంది ఆక్రమించారు? తదితర వివరాలకు సంబంధించిన నివేదికను అందజేయాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే నివేదిక ఇచ్చినప్పటికీ సమగ్ర నివేదికను అడిగినట్లు తెలిసింది. ఎంత భూమిని ఆక్రమణ దారుల నుంచి వెనక్కి తీసుకున్నారు? ల్యాండ్ ప్రొటెక్షన్ టీం తీసుకుంటున్న చర్యలు, చేపట్టిన సమీక్షలకు సంబంధించిన వివరాలను సైతం ఇవ్వాలని మంత్రి ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.
భూములు ఆక్రమణకు పాల్పడిన వారిపై రాష్ట్ర వ్యాప్తంగా 1146 కేసులు ఉండటంతో ఆ కేసులు కోర్టులో ఏ స్థాయిలో ఉన్నాయనే వివరాలపైనా ఆరా తీసినట్లు సమాచారం. మహబూబ్నగర్లో అత్యధికంగా3018.01 ఎకరాలు, రెండో స్థానంలో 2888.18 ఎకరాలతో మేడ్చల్ ఉంది. త్వరలోనే శాఖ లీగల్ టీం, ల్యాండ్ ప్రొటెక్షన్ టీం, అధికారులతో త్వరలోనే సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
Also Read:Phone Tapping Case: సిట్ ఎదుటకు.. రెండోసారి ప్రభాకర్ రావు!
పీడీ యాక్టులకు రంగం సిద్ధం
ఇకపై ఆలయ భూములు ఆక్రమణకు పాల్పడే వారిపై పీడీ యాక్టులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమణ దారులపై కేసులు పెడితే అవి కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని, దీంతో సమయం వృథా అవుతుందని, ఆలయాలకు నష్టం జరుగుతుందని భావించిన ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఎవరు ఆలయ భూముల జోలికి రాకుండా కఠిన యాక్టులు సైతం పెడితేనే రక్షణ ఉంటుందని మంత్రి సురేఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
అందుకు లీగల్ టీంకు సైతం ఇప్పటికే మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఆలయ భూములను కాపాడేందుకు రక్షణ చర్యల్లో భాగంగా కంచె ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు దగ్గర ఉండి చర్యలు తీసుకోవాలని, నిత్యం ఆలయ భూములపై సమీక్షా సమావేశాలు జిల్లాల వారీగా నిర్వహించాలని మంత్రి సూచించినట్లు సమాచారం.
చెంగిచెర్లలో మంత్రి ఆకస్మిక తనిఖీలు
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో దేవాదాయ శాఖ భూమి అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఫిర్యాదు మేరకు గురువారం మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూమిని మంత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. కలియ తిరిగారు. చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 33/8లో 10.33 ఎకరాలు, సర్వే నెంబర్ 33/9లో 13 ఎకరాలు, సర్వే నెంబర్ 33/10 లో 6.33 ఎకరాల చొప్పున మొత్తం 30.28 ఎకరాల భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కబ్జా చేసేవారిపై పీడీ యాక్టులు పెడతామని హెచ్చరించారు.
ఆలయ భూములను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దేవుడి భూములు కాపాడుతున్నట్టు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలో మొత్తం 30.28 ఎకరాల భూమిని 1968లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్కు భూ పట్టదారులైన తోటకూర ఎల్లయ్య యాదవ్, రామయ్య చౌదరి తదితరుల ద్వారా, సీలింగ్ యాక్ట్ నిబంధనల మేరకు సదరు భూమిని 1976 సంవత్సరంలో దేవాదాయ శాఖకు అప్పగించారని తెలిపారు. అప్పటి నుంచి ఈ భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నదన్నారు. ఈ భూములను కబ్జా చేసేందుకు కొంతమంది పని చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
దేవాదాయ శాఖ భూములు కబ్జాకు పాల్పడిందే ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ పాలనలో స్థానిక ఎమ్మార్వోతో కలసి కొంతమంది నకిలీ సర్వే చేయించి అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నం చేసినట్టు అధికారులు వివరించారు. కాగా, తాజాగా ఏడీ సర్వే చేయించగా ఈ భూములన్నీ దేవాదాయ శాఖకు చెందిన భూములుగా తేలినట్టు మంత్రి సురేఖ తెలిపారు. రెవెన్యూ, దేవాదాయ, పోలీసు అధికారులను పిలిపించి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్తోనూ ఫోన్లో మాట్లాడారు. దేవాదాయ శాఖకి చెందిన ఈ 30 ఎకరాల భూములను రక్షించి బార్ కోడ్ చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Also Read:KCR Kaleshwaram: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఏం చెబుతారో?