నల్లగొండ బ్యూరో స్వేచ్చ : Minister Komatireddy Venkat Reddy: నల్లగొండ జిల్లా మతసామరస్యానికి ప్రతీకని తెలంగాణ రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంజాన్ పండుగ నేపథ్యంలో నల్లగొండ జిల్లా కేంద్రం మునుగోడు రోడ్డులోని ఈద్గాలో ప్రార్థనలు జరిపిన ముస్లింలను కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. స్వతంత్ర పోరాటంలో ముస్లింల పాత్ర మరువలేనిదన్నారు. దేశాభివృద్ధికి ఎంతోమంది ముస్లింలు కృషి చేశారని, అందులో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా, సైంటిస్ట్గా చేసిన సేవలు మరువలేనివని తెలిపారు.
హిందూ, ముస్లింలు అందరూ కలిసి నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. నల్గొండలో శాంతిభద్రతలు బాగుండాలని, హిందూ, ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. నల్గొండ పట్టణంలోని దర్గాలు, ఈద్గాల అభివృద్ధికి తాను గత 25 సంవత్సరాల నుండి కృషి చేస్తున్నానని తెలిపారు. ఇక్కడి ఈద్గా తెలంగాణలోనే అతిపెద్ద ఈద్గా అన్నారు. ఇటీవల నల్గొండలో నిర్వహించిన ఇస్తేమాలో సుమారు 50 వేల మంది పాల్గొన్నా ఎలాంటి సమస్య లేకుండా తాగునీరు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
TG on BC reservation: తెలంగాణ తరహా చట్టం? ఉత్తరాది రాష్ట్రాలలో తీవ్రమైన చర్చ..
ముఖ్యంగా లతీఫ్ సాబ్ దర్గా కు ప్రతి సంవత్సరం నిర్వహించే ఉర్సు, ఇతర ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది వస్తారని, పెద్దవారు, ముసలివారు గుట్ట ఎక్కలేరని, దీన్ని దృష్టిలో ఉంచుకొని లతీఫ్ సాబ్ దర్గాకు రూ.100 కోట్లతో ఘాట్ రోడ్ నిర్మిస్తున్నామని, టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
లతీఫ్ సాబ్ గుట్ట నుండి బ్రహ్మంగారి గుట్ట వరకు రోప్ వే నిర్మిస్తున్నామని, బ్రహ్మంగారి గుట్టకు కూడా వేరే ఘాట్ రోడ్ వేయిస్తున్నామని, రూ.500 కోట్లతో కొత్త బైపాస్ రోడ్డు టెండర్లు వేశామని, వారం రోజుల్లో పనులు మొదలవుతున్నాయని వివరించారు.
GHMC Property Tax: సరికొత్త రికార్డ్ సృష్టించిన జీహెచ్ఎంసీ.. కమిషనర్ ఒక్క ఐడియానే కారణమట..
నల్గొండలో ముస్లింల సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, మెడికల్ కళాశాల, కలెక్టరేట్ తదితర ప్రభుత్వ సంస్థల్లో ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ పద్ధతిపై అర్హులైన ముస్లిం అభ్యర్థులను నింపేందుకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా జిల్లా కలెక్టర్కు ఇదివరకే ఆదేశించామని వెల్లడించారు. దీంతోపాటు పేద ముస్లింలకు ఇండ్లు కట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, నల్గొండ పట్టణం సమీపంలో పేదవారికి ఇండ్ల నిర్మాణానికి భూమిని గుర్తించామని, ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇచ్చి రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని, ప్లాట్లు ఉంటే నేరుగా ఇల్లు కట్టిస్తామని చెప్పుకొచ్చారు. మంత్రి వెంట నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు