జోగిపేట స్వేచ్ఛ: Damodar Rajanarsimha: పదేళ్లు జెండా మోసినోళ్లకే జడ్పీ, డీసీసీబీ చైర్మన్ పదవులతో పాటు స్థానిక సంస్థల పదవులు దక్కుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. చౌటకూర్ మండలం సింగూరు చౌరస్తాలోని ఎంఎస్ గార్డెన్లో నిర్వహించిన ఆత్మ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి డీఏఓ శివప్రసాద్ అధ్యక్షత వహించారు. మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పార్టీ కోసం కష్టపడ్డ వారి కోసం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉండి గెలిపించుకుంటానని ప్రకటించారు.
ఆత్మకమిటీ చైర్మన్గా నియమితులైన మల్లారెడ్డితో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. వ్యవసాయం సమాజానికి చాలా కీలకమన్నారు. రైతుకు అండగా ఉండేది ప్రజా ప్రభుత్వమని అన్నారు. వ్యవసాయం దండగా కాదు పండగ అని చెప్పింది దివంగత నేత వైఎస్సార్యని అయన గుర్తు చేశారు. వైఎస్సార్ పాదయాత్ర సందర్బంగా జోగిపేటలో కాలువల నిర్మాణానికి హమీని ఇచ్చారని, రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.89.98 కోట్లు మంజూరు చేసి స్వయంగా పనులకు శంకుస్థాపన చేసారన్నారు. గత పదేళ్లుగా కాలువలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసాయని, రూ.170 కోట్లతో లైనింగ్ పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
అందోల్లో ఫార్మా పీజీ కాలేజ్
అందోలు నియోజకవర్గంలో 15 ఎకరాల స్థలంలో ఫార్మ కాలేజీ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు, దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి అన్నారు. పీహె చ్సీ, ఆంబులెన్స్, పోలీస్ స్టేషన్, కేజీవిబి, పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో సుల్తాన్పూర్ వద్ద 160 ఎకరాలలో రూ.400 కోట్లతో జేఎన్టీయు నిర్మాణం చేపట్టినట్లు మంత్రి గుర్తు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయన్నారు.
సింగూరు టూరిజంకు రూ.50 కోట్లు
జిల్లాలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన సింగూరు ప్రాజెక్టును టూరిజం కేంద్రంగా అభివృద్ది చేసేందుకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మంజూరు చేయిస్తానని మంత్రి దామోదర్ అన్నారు. ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా హైద్రాబాద్ ప్రాంతానికి చెందిన టూరిస్టులు కూడా ప్రాజెక్టు వద్దకు వస్తుంటారన్నారు. అందోలులో రూ.50 కోట్లతో నర్సింగ్ కాలేజ్ మరో రూ.50 కోట్లతో హాస్పిటల్, ట్రామా సెంటర్లను మంజూరు చేయించినట్లు తెలిపారు.
రైతులకు సాంకేతిక పద్దతులపై అవగాహన పెంచాలి
కొత్తగా భాద్యతలను చేపట్టిన ఆత్మకమిటీ పాలకవర్గం ఇతర ప్రాంతాలకు వెళ్లి నూతన వ్యవసాయ విధానంపై తెలుసుకోవడమే కాకుండా సాంకేతిక పద్దతులపై రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న ప్రదేశాలను రైతులు సందర్శించాలి. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతంలోని ఆత్మ కమిటీలను పూర్తి చేస్తామన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ రాష్ట్రానికి మంత్రి అయినప్పటికిని నియోజకవర్గానికి ఎక్కువ సమయాన్నిస్తూ అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్నాడని అన్నారు.
నిజమైన రైతు ప్రతినిధికే ఆత్మకమిటీ చైర్మన్ పదవిని కెటాయించారని అన్నారు. రైతులకు అందుబాటులో ఉంచి సేవలందించాలన్నారు. మెదక్ సంగారెడ్డి గ్రంధాలయ సంస్థ చైర్మన్లు సుహసిని రెడ్డి, అంజయ్య యాదవ్, మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మొహన్రెడ్డి, ఆర్డీఓ పాండు, మండల పార్టీ అధ్యక్షుడు దశరథ్లతో పాటు ఆత్మ డైరెక్టర్లు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: నా బ్రాండ్ నాదే.. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్