తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ (KCR) హడావిడి చేసిన ఫెడరల్ ఫ్రంట్ పాలిటిక్స్ ఇప్పుడు పలు పార్టీల భవిష్యత్తుకు ప్రశ్నార్థకంగా మారింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ప్రాంతీయ పార్టీలతో కూడిన కూటమిలాంటి వ్యవస్థ ఏర్పాటుకు ఆయన భారీ ప్రయత్నాలే చేశారు.
అందులో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, బిజూ జనతాదళ్ నేత నవీన్ పట్నాయక్, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) నేతలు దేవెగౌడ, కుమారస్వామి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేతలు లాలూప్రసాద్, తేజస్వి యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్.. తదితర నేతలందరినీ KCR కలిశారు. ఐదేండ్ల తర్వాత తిరిగి చూస్తే బీఆర్ఎస్ సహా ఈ పార్టీలన్నీ పాపులారిటీని కోల్పోయాయి.
Also Read : చీపురిని చిమ్మేసిన కమలదళం… ఢిల్లీలో బీజేపీ ఘనవిజయం
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్వయంగా తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఒడిశాలో సైతం రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ (బీజేడీ) ఊహించని తీరులో ఓడిపోయారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన పార్టీలు, యూపీలో సమాజ్వాదీ పార్టీ, కర్ణాటకలో జేడీఎస్, బిహార్లో ఆర్జేడీ.. ఇవన్నీ ప్రాభవాన్ని కోల్పోయి ఉనికిని నిలుపుకోడానికి పడరాని పాట్లు పడుతున్నాయి.
వరుసగా మూడు టర్ములు ఢిల్లీలో పవర్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సగానికిపైగా సీట్లు కోల్పోయి ప్రతిపక్షంగా మారిపోయింది. దీంతో కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కలిసిన నేతలందరూ ఫేమ్ కోల్పోయారని, కొన్ని అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంగా మారితే మరికొన్ని చీలికలకు లోనయ్యాయని, ఇంకొన్ని గతంతో పోలిస్తే బలహీనపడ్డాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు మొదలయ్యాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన తర్వాత KCR తాను ఓడిపోవడమే కాక ఆ పార్టీల ఓటమికీ కారకులయ్యారంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి.