KTR: పసుపు బోర్డు ఏర్పాటు ప్రారంభోత్సవంపై బీజేపీ-బీఆర్ఎస్ (BJP-BRS) మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆదివారం నాడు నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) విచ్చేసి.. జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పూజలు నిర్వహించి అనంతరం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం తర్వాత ఇందూరు రైతు మహా సమ్మేళన సభలో షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘ పసుపు బోర్డు ప్రారంభించడం నా అదృష్టం. ఇందూర్ రైతుల పోరాటాన్ని గుర్తించిన మోదీ సర్కారు పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. ఇప్పుడు పసుపు పంటకు నిజామాబాద్ క్యాపిటల్ సిటీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అనాదిగా నిజామాబాద్ రైతులు పసుపు సాగు చేస్తున్నా.. బయట మార్కెట్లో గుర్తింపు అనుకున్న స్థాయిలో దక్కలేదు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఇందూర్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనుంది. ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎక్స్ పోర్ట్ పసుపు బోర్డు చేస్తుంది. పసుపు యాంటిబయోటిక్. దైనందిన జీవితంలో భాగం. ఇక్కడి పసుపునకు జియో ట్యాగింగ్ చేస్తున్నాం. 2030 లోపు 1 మిలియన్ డాలర్ పసుపు ఎగుమతి ప్రణాళిక చేశాం. పసుపు రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. 2025లో పసుపునకు రూ.19 వేల ధర వచ్చింది. రానున్న మూడేండ్లలో పసుపు ధర రూ.6వేల నుంచి రూ.7వేలు అధికం కానుంది. బోర్డు ద్వారా పసుపు ఉత్పత్తి కూడా పెరగనుంది. భారత కో ఆపరేటివ్ బ్రాంచ్, భారత్ కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్ బ్రాంచీలు ప్రారంభిస్తాం. పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరింది. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుంది’ అని అమిత్ షా హామీ ఇచ్చారు. అయితే కేంద్ర మంత్రి ప్రసంగంపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రం, షాపై ప్రశ్నల వర్షం కురిపించారు.
నిజమా.. కాదా?
‘ అమిత్ షా.. తెలంగాణలోని రేవంత్ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా..? కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వంపై విచారణ జరపడానికి కేంద్రానికి ఏం అడ్డు వస్తుందో తెలంగాణ ప్రజలకు వివరించగలరా? ఢిల్లీలో కాంగ్రెస్తో బీజేపీ కుస్తీ, తెలంగాణలో మాత్రం దోస్తీ అన్నట్టుగా సాగుతున్న కుమ్మక్కు రాజకీయాల వల్లే రేవంత్ను వెనకేసుకొస్తున్నారనే ఆరోపణలకు సమాధానం ఉందా? తెలంగాణ ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్ను బీజేపీ పావుగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా? గతంలో దేశ ప్రధాని మోదీ వచ్చినప్పుడు, ఏకంగా రాహుల్-రేవంత్ కలిసి ఆర్.ఆర్. టాక్స్ పేరిట దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు కానీ దర్యాప్తునకు మాత్రం నేటికీ ఆదేశించలేదు. దేశ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి హోదాలో మీరు తెలంగాణకు వచ్చి కేవలం సీఎంపై అవినీతి ఆరోపణలు చేస్తే సరిపోతుందా? పట్టపగలు ప్రజాధనం లూటీ చేస్తూ ఢిల్లీకి మూటలు పంపుతున్న కాంగ్రెస్ సీఎం అక్రమాలకు కేంద్ర అడ్డుకట్ట వేయలేదా?’ అని కేంద్రం, షాను కేటీఆర్ ప్రశ్నించారు.
Read Also- Anchor Swetcha: పూర్ణ చందర్ రిమాండ్లో సంచలనం.. బీఆర్ఎస్ కీలక నేత పేరు!
కేసీఆర్ నిర్మించిన ఆఫీసులో..
‘ మరోవైపు.. ధాన్యం దిగుబడిలో పంజాబ్ నే తలదన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తెలంగాణ ఎదగడంలో కీలకపాత్ర పోషించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బురదజల్లడం అత్యంత దురదృష్టకరం. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా, ఇద్దరు కేంద్రమంత్రులున్నా, తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా, కనీసం ఒక్క ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజీ వంటి ఉన్నత విద్యాసంస్థలు మంజూరు చేయకుండా బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని నాలుగు కోట్ల ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో పసుపు బోర్డుకు నయా పైసా కేటాయించకుండా.. పేరుకు పసుపు బోర్డు పెట్టి రిబ్బన్ కట్ చేస్తే ప్రయోజనమేంటి? కనీసం సొంత భవనం కూడా కట్టకుండా.. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా? అసలు ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం సబబేనా?.. ఈ జనవరి 14న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ వర్చువల్ గా పసుపు బోర్డును ప్రారంభించేశారు. మరోసారి మీరు ఇవాళ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ప్రయోజనమేంటి?’ అని అమిత్ షాను కేటీఆర్ నిలదీశారు.
Read Also- Minister Ponnam Prabhakar: జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం.. మంత్రి పొన్నం
ఇవన్నీ పట్టవా..?
‘ ఏపీలోని టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు నదుల అనుసంధానం ముసుగులో కేంద్రం బంగారు బాటలు వేయడం.. గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాయడం కాదా? విభజన చట్టం ప్రకారం అడవిబిడ్డలకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు కర్మాగారానికి పాతరేసి, హైదరాబాద్ రూపురేఖలు మార్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా రద్దుచేయడం తెలంగాణ ప్రజలకు కేంద్రం చేసిన ద్రోహం కాదా? పేరుకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నా, నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకే అప్పగించే ప్రయత్నాలకు స్వస్తిపలికి వరంగల్ యువత ఉపాధికి భరోసా ఇవ్వగలరా? కేంద్రంలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి నేటి వరకు అడుగడుగునా తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరిస్తున్న బీజేపీ ఈ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాదు. రాలేదు.. జై తెలంగాణ’ అని కేటీఆర్ నినదించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామెంట్స్కు బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో.. ఎవరు ఈ ప్రశ్నలకు బదులిస్తారో వేచి చూడాలి మరి.
గౌరవ అమిత్ షా గారు..
తెలంగాణలోని రేవంత్ సర్కారు.. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఏటీఎంలా మారిపోయిందని నిజామాబాద్ గడ్డపై తేల్చిచెప్పిన మీరు, మరి కేంద్ర హోంమంత్రిగా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదో చెప్పగలరా..?
కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీతో.. అవినీతి…
— KTR (@KTRBRS) June 29, 2025