తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : Women Commits Suicide: అదనపు కట్నం కోసం అత్తింటివారు పెడుతున్న వేధింపులు భరించలేక ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదం కేపీహెచ్భీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ నివాసి సౌజన్య (29) వివాహం 2020, డిసెంబరులో మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లికి చెందిన రజనీకాంత్ రెడ్డితో జరిగింది. పెళ్లి సమయంలో సౌజన్య తల్లిదండ్రులు కట్నంగా 18లక్షల రూపాయలు ఇచ్చారు. ప్రస్తుతం వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఇక, వివాహానికి ముందు సౌజన్య ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేది. పెళ్లయిన తరువాత భర్త చెప్పటంతో ఉద్యోగాన్ని మానేసింది. ఇక, వివాహమైన తరువాత సౌజన్యతోపాటు హైదరాబాద్ వచ్చిన రజనీకాంత్ రెడ్డి మొదట్లో ఎల్బీనగర్ లో కాపురం పెట్టాడు. ఆ తరువాత పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారం, నగదు సరిపోలేదని భార్యను వేధించటం మొదలు పెట్టాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ శారీరకంగా హింసించటం మొదలు పెట్టాడు. కొడుక్కి బుద్ధి చెప్పాల్సిన రజనీకాంత్ రెడ్డి తల్లి కూడా అతనికే వంత పాడింది.
Also Read: Jagityal District: కమిషన్ కొనుగోలా? ఓపెన్ వేలమా? మామిడి కొనుగోలు పై మల్లగుల్లాలు..
సౌజన్యను మానసికంగా, శారీరకంగా హింసించింది. ఈ నేపథ్యంలో సౌజన్య కుటుంబీకులు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా పెట్టారు. తీరు మార్చుకోవాలని రజనీకాంత్ రెడ్డికి చెప్పారు. అనంతరం తమ తరపు బంధువులు అధికంగా ఉన్న కేపీహెచ్భీ ప్రాంతానికి రజనీకాంత్ రెడ్డితో మకాం మార్పించారు. ఇక్కడకు వచ్చిన తరువాత కూడా సౌజన్యకు భర్త, అత్త నుంచి వేధింపులు ఏమాత్రం తగ్గలేదు. దాంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి మంగళవారం రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్భీ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈలింక్ https://epaper.swetchadaily.com/ క్లిక్ చేయగలరు