పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం
శ్రేణుల్లో నిస్తేజం స్థానంలో జోష్ నింపేలా
గ్రామస్థాయి నుంచి కమిటీల ఏర్పాటు
ఇంతకాలం ‘ఎమ్మెల్యే సుప్రీం’ ఫార్ములా
సెక్యులర్ స్లోగన్తో ముస్లింలకు గాలం
ఉద్యమ పార్టీ పేరుతో సెంటిమెంట్ అస్త్రం
పార్టీ నేతలు చేజారకుండా జాగ్రత్తలు
మహిళలకు 53 టికెట్లు ఇచ్చేలా ప్రకటన
Brs | తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చేదు అనుభవం ఎదుర్కొన్న బీఆర్ఎస్.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. నిస్తేజంగా ఉన్న కేడర్లో జోష్ నింపే ప్రయత్నం మొదలుపెట్టింది. పార్టీలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు, గ్రామ స్థాయి నుంచి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు అధినేత కేసీఆర్ (kcr) క్లారిటీ ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నప్పటికీ హరీశ్రావుకు (harishrao) ఈ బాధ్యతలను అప్పజెప్పడంపై పార్టీలోనే చర్చలు మొదలయ్యాయి. ఇంతకాలం ఎమ్మెల్యేలే సుప్రీం అనే విధానం అమలైనా ఇప్పుడు కేడర్ను కాపాడుకునేందుకు కొత్త నిర్మాణ వ్యవస్థను తెరపైకి వస్తున్నది. మరోవైపు ఉద్యమ పార్టీ అంటూ సెంటిమెంట్ అస్త్రాన్నీ కేసీఆర్ ప్రయోగిస్తున్నారు. పదిమంది ఎమ్మెల్యేలు చేజారడంతో ఉప ఎన్నికలు తథ్యమనే అంశాన్ని ప్రస్తావించారు. ఇంకెవ్వరూ దూరం కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
స్థానిక ఎన్నికలు తొలి టార్గెట్
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా పార్టీని గ్రామ స్థాయి నుంచే బలోపేతంగా ఉంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ముస్లిం ఓటర్లు దూరమయ్యారని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూలంగా మళ్లినందునే బీఆర్ఎస్ ఓడిపోయిందనే జనరల్ టాక్ ఉన్న నేపథ్యంలో సెక్యులర్ పార్టీ అనే స్లోగన్ను కేసీఆర్ ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ సక్సెస్ కావడంతో మహిళా ఓటు బ్యాంకును ఆకట్టుకునేలా ఈసారి 53 సీట్లు కేటాయిస్తామంటూ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో అధినేత కేసీఆర్ వ్యూహాత్మక ప్రకటన చేశారు. ఏయే సెక్షన్ల ప్రజలు దూరమయ్యారో ఏడాది కాలం విశ్లేషణ చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఏడాది పొడవునా పార్టీ సిల్వర్ జూబ్లీ సెలెబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ నెలా ఒక అంశంపైన రోడ్డెక్కే కార్యక్రమం నిర్వహించాలని పార్టీ భావిస్తున్నది.
అందరి సమస్యలపై ఆందోళనలు
రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థుల సమస్యలను టేకప్ చేయాలనుకుంటున్నది. గ్రామ స్థాయి నుంచే ఈ కమిటీలను స్ట్రాంగ్ చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నది. ఒకవైపు కాంగ్రెస్ పట్ల ప్రేమతో ప్రజలు ఓటు వేయలేదని కేసీఆర్ కామెంట్ చేస్తూనే మరోవైపు ఏడాదిలోనే ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత వస్తుందని అనుకోలేదని కేడర్లో కొత్త చర్చకు తెరలేపారు. భవిష్యత్తు బీఆర్ఎస్దేననే, అధికారంలోకి వచ్చేది మన పార్టీయేనంటూ నేతల్లో భరోసా కలిగించేలా కేసీఆర్ ప్రసంగించడం గమనార్హం. అధినేత ఫామ్ హౌజ్కే పరిమితం కావడంతో కేటీఆర్, హరీశ్రావు, కవిత వేర్వేరుగా యాక్టివిటీస్ చేస్తుండడంతో శ్రేణులు ఎటువైపు వెళ్ళాలో అర్థంకాని అయోమయం నెలకొన్నది. పార్టీ మరింత బలహీనం అవుతుందనే చర్చ తెరపైకి రావడంతో నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగారు. యువతదే భవిష్యత్తు అంటూ వారు నీరుగారిపోకుండా ఉత్సాహంగా పనిచేసేలా, కాబోయే ఎమ్మెల్యేలు కూడా మీరే.. అంటూ హితబోధ చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపన నాటి అంశాలను ఏకరువు పెట్టడంతో పాటు ఉద్యమ పార్టీ సెంటిమెంట్ను రేకెత్తించడం గమనార్హం.
సిల్వర్ జూబ్లీ సెలెబ్రేషన్స్ బాధ్యతా హరీశ్కే!
పార్టీ సిల్వర్ జూబ్లీ సెలెబ్రేషన్స్ బాధ్యతలను హరీశ్రావుకు అప్పగించడంతో కేటీఆర్ రోల్ ఏంటనే చర్చ కూడా పార్టీ శ్రేణుల్లో మొదలైంది. మరోవైపు తెలంగాణ జాగృతి ఏం చేయాలో అది చేస్తుంది.. అంటూనే పార్టీలో మహిళా విభాగం కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించడం సరికొత్త చర్చకు దారితీసింది. పార్టీతో సంబంధం లేకుండా ఆమె సొంతంగా యాక్టివిటీస్ చేపట్టడంపై రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత కేసీఆర్ యాక్టివ్ అవుతారా?.. ఫామ్ హౌజ్ను విడిచి బైటకు వస్తారా?.. పార్టీని గాడిన పెట్టేలా స్వయంగా పర్యవేక్షిస్తారా?.. కేడర్లో ఇలాంటి ఆశలు రేకెత్తాయి. స్థానిక ఎన్నికల నాటికి పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి కొన్ని స్థానాలనైనా గెలిపించుకోవడం తక్షణ సవాలుగా మారింది.