తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: KCR Absent: లోకాయుక్త, ఉప లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, సమాచార కమిషన్ నియామకాల కోసం ఏర్పడిన కమిటీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గైర్హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు, అధికారిక కార్యక్రమాలకు హాజరుకావడంలేదంటూ ఇప్పటికే ఆయనపై విమర్శలు ఉన్నాయి. రాజ్యంగబద్ధమైన పోస్టుల్లో వ్యక్తులను నియమించడానికి ఏర్పడిన ఈ కమిటీల్లో ముఖ్యమంత్రితో పాటు ఆయన నామినేట్ చేసిన ఒక మంత్రి, అసెంబ్లీలో, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉంటారు.
వీరితో పాటు అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ కూడా సభ్యులే. వీరంతా హాజరైనా ఇటు అసెంబ్లీలో, అటు కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నేతలుగా ఉన్న కేసీఆర్, మధుసూదనాచారి ఆబ్సెంట్ అయ్యారు. ఈ సమావేశాలకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానం పంపినా దూరంగా ఉండడం గమనార్హం. దీనికి తోడు కమిటీల్లో సభ్యులను ప్రతిపాదించడానికి విముఖత వ్యక్తం చేశారు.
పార్లమెంటు స్థాయిలో (లోక్సభలో) ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్గాంధీ ఫిబ్రవరిలో జరిగిన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎంపిక సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో సైతం రాజ్యాంగబద్ధమైన కమిషన్లలో చైర్పర్సన్ సహా సభ్యులను ఎంపిక చేయడంపై ఇటు ప్రభుత్వం నుంచి, అటు ప్రతిపక్షం నుంచి అభిప్రాయాలను తీసుకుని ఎంపిక చేయడం ఆనవాయితీ మాత్రమే కాక నిబంధన కూడా. కానీ కేసీఆర్, మధుసూదనాచారి హాజరుకాకపోవడంతో ‘కోరం’ ఉండడంతో సమావేశాలు యధావిధిగా కొనసాగాయి.
లోకాయుక్త, ఉప లోకాయుక్త ఎంపిక విషయంలో ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా రేవంత్రెడ్డి హాజరుకాగా కమిటీలో సభ్యుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ హాజరయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా సభ్యులే అయినా ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఖరారు కానున్నది.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, సమాచార కమిషన్ చైర్పర్సన్, సభ్యుల ఎంపిక విషయంలోనూ హైకోర్టు చీఫ్ జస్టిస్ మినహా మిగిలినవారంతా సభ్యులు. ఒకే రోజున మూడు కమిషన్ల కూర్పుపై జరుగుతున్న సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతలు ఇద్దరూ (అసెంబ్లీ, కౌన్సిల్లో) గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. హాజరు కావాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం మేరకు ఇద్దరూ దూరంగా ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. వారి తరఫున ఈ కమిషన్లలో ఎవరి పేర్లనూ ప్రతిపాదించకపోవడానికీ కారణాలున్నట్లు తెలిసింది.
భవిష్యత్తులో ఏదైనా సమాచారం లీక్ అయినా వీరివల్లనే అయిందనే విమర్శలకు తావు ఇవ్వరాదనే ఉద్దేశంతో ఇందులో ఎవ్వరి పేర్లనూ ప్రతిపాదించాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపై విమర్శలు, ఆరోపణలు వస్తున్న సమయంలోనే ఇప్పుడు కమిటీల మీటింగులకు సైతం దూరంగా ఉండడం చర్చకు దారితీసింది.
Also Read: BRS Party: బీఆర్ఎస్ తో టచ్ లో ఆ ఎమ్మెల్యేలు? కేసీఆర్ ఓకే చెప్పేనా?