Kaleswaram: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నది. కేసీఆర్ చేసిన తప్పిదాలు, ఇతర నేతలు, అధికారుల బండారాన్ని కమిషన్ బయటపెట్టింది. ఈ క్రమంలో పొలిటికల్గా ఈ అంశం మంటలు రేపుతున్నది. ఇదే సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇంకోవైపు పార్టీ నేతలతో కేసీఆర్ వరుస మంతనాలు జరుపుతున్నారు. అటు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ వస్తారా?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన నాటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరైంది చాలా తక్కువే. ప్రమాణం చేసినప్పుడు ఓసారి, తర్వాత ఇంకోసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. చాలాకాలంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. కానీ, ఆయన మాత్రం రావడం లేదు. ఇప్పుడు కాళేశ్వరం రిపోర్ట్ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికపై ప్రత్యేక చర్చ కోసం ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. అయితే, కేసీఆర్ వస్తారా రారా అనేది సస్పెన్స్.
బీఆర్ఎస్లో టెన్షన్.. కేసీఆర్ భేటీలు
కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో బీఆర్ఎస్లో టెన్షన్ నెలకొన్నది. నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కారు చర్యలు చేపట్టే అవకాశం ఉండడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కొనసాగుతున్నది. ఎర్రవెల్లి ఫాంహౌస్లో కొద్ది రోజులుగ కేసీఆర్ ముఖ్య నేతలతో సమవేశాలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొన్న అంశాలపై చర్చలు జరుపుతున్నారు. దాని ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఏం చేయాలి అనే దానిపై చర్చిస్తున్నారు. అంతేకాదు, క్యాబినెట్ భేటీలో ఏం చర్చిస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారు అనే వాటిపైనా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ భేటీల్లో హరీశ్ రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు, కవిత ఎపిసోడ్పైనా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
మరోవైపు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు కామధేనువుగా మారిందని అన్నారు. బ్యారేజీలు ఏటీఎంలా మారాయని గతంలో చెప్పామని, ఇప్పుడు అదే నిజం అయ్యిందని చెప్పారు. కమిషన్ రిపోర్ట్ కేసీఆర్ తప్పులను ఎత్తి చూపిందని, దాని ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సమాజం తరుఫున తాను కొరుతున్నానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోవడానికి కారణం అయిన కేసీఆర్ తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.