నల్లగొండ బ్యూరో స్వేచ్ఛ: IPL Betting Addiction: ఐపీఎల్లో ఫలానా టీం గెలిస్తే రూ.వెయ్యికి రూ.10 వేలు సిక్స్ కొడితే పెట్టిన బెట్టింగ్కు డబుల్ 20 ఓవర్లకు 120 లోపే స్కోరు కట్టడి చేస్తే మూడింతలు బాల్బాల్కు పందెం ఇదీ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) నేపథ్యంలో పల్లెల్లో బెట్టింగ్ తీరు ఐపీఎల్ బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. పల్లెలకూ బెట్టింగ్ సంస్కృతికి పాకింది. ఆన్లైన్, ఆఫ్లైన్లలో యథేచ్ఛగా సాగుతోంది. నిత్యం రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. తక్కువ సమయంలో డబ్బులు సందపాదించాలనే ఆశతో యువత చిత్తవుతున్నారు.
కొంత మంది బానిసై అప్పులు చేసి, ఆస్తులు తాకట్టుపెట్టి బెట్టింగ్ కాస్తున్నారు. గత నెల 22వ తేదీన ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది. దీంతో ఇన్ని రోజులు బెట్టింగ్ లేక ఖాళీగా ఉన్న పందెం రాయుళ్లకు పనిదొరికినట్లయ్యింది. బుకీలు సైతం వీరిని పనిలోకి దింపి కమీషన్లు రాబట్టుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మారుమూల పల్లెల్లోనూ బెట్టింగులు నడుస్తున్నాయి. ఇంతకాలం పట్టణాలు, జిల్లాకేంద్రాల్లో పందేలు జరిగేవి. కానీ ఇప్పుడు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ దాదాపుగా బెట్టింగ్ భూతం పాకిపోయింది.
ఆన్లైన్.. ఆఫ్లైన్..
బెట్టింగ్ వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. బుకీలు ఆన్లైన్లో ఆఫ్లైన్లోనూ బెట్టింగ్ కాస్తున్నారు. ఊర్లలో రహస్యం కొంతమంది గ్రూపులుగా ఏర్పడి పందెం కాస్తున్నారు. కొంత మంది గ్రామ శివార్లలోని ఫాంహౌస్లు, హోటళ్లలో నడిపిస్తున్నారు. కొందరు తమ తమ సర్కిళ్లలో ఫోన్ల ద్వారా కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఫోన్ల ద్వారానే కాకుండా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి వాటిలో సీక్రెట్గా గ్రూపులు పెట్టి నడిపిస్తున్నారు. గ్రామాల్లో యువకులు ఒకచోట గుమిగూడి ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్నారు.
మరికొందరు ఇంట్లోనే టీవీల ముందు కూర్చుని ఆన్లైన్లో బెట్టింగ్ కాస్తున్నారు. ఇక బెట్టింగ్ కోసం ప్రత్యేక యాప్లు కూడా ఉన్నాయి. బెట్టింగ్లకు ప్రత్యేకంగా కోడ్ భాషను ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోవడంతో ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు చేతులు మారుతున్నాయి.
బాల్ టూ బాల్ బెట్టింగ్ ఇలా..
ఒక ప్లేయర్ బాల్కు ఎన్ని పరుగులు కొడతాడు? ఓవర్లో ఎన్ని ఫోర్లు కొడతాడు? సిక్సర్ కొడతాడా? ఫోర్ కొడతాడా లేక ఈ బాల్కు ఔట్ అవుతాడా? అంటూ జూదమాడుతున్నారు. కేవలం మ్యాచ్ విజేతలు ఎవరు అనేది మాత్రమే కాకుండా టాస్ ఎవరు గెలుస్తారు, ఏ బాట్స్మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు.. అనే దానితో పాటుగా బాల్బాల్కు బెట్టింగ్ వేస్తుంటారు. కేవలం మ్యాచ్ ఫలితాలపైనే కాదు.. టాస్ పడినప్పటి నుంచి మొదలు బాల్ బాల్కు పందెం కాస్తున్నారు.
Also Read: Hyderabad Footpaths incident: రోడ్డుపై నడిచేవాళ్లు జాగ్రత్త.. భయపెడుతున్న లెక్కలు!
ఎవరు టాప్ స్కోరర్గా నిలుస్తారు?.. ఎక్కువ వికెట్లు ఎవరు తీస్తారు. ఫోర్లు ఎన్ని కొడతారు, సిక్స్లు ఎన్ని కొడతారు ఇలా రకరకాలుగా బెట్టింగ్లు కాస్తున్నారు. ఆ జట్టు గెలిస్తే వెయ్యి ఓడితే రెండింతలు ఈ బంతి సిక్స్ పోతే ఇంత ఫోర్ పోతే అంత వికెట్ పడితే ఇంతా అంటూ బెట్టింగులు కాస్తున్నారు.
రూ.100 నుంచి 10వేల దాకా
బెట్టింగ్ రాయుళ్లు ప్రధాన టీంలకు ఒక రేటు, మామూలు జట్లకు ఒక రేటును ఫిక్స్ చేస్తారు. వందకు వెయ్యి, వెయ్యికి పదివేలు, పదివేలకు లక్ష రూపాయల చొప్పున పందెం వేస్తున్నారు. వంద నుంచి ప్రారంభమై రూ. 10 వేల వరకూ బెట్టింగ్లు జరుగుతున్నాయి. మ్యాచ్ల పరిస్థితులను బట్టి రూ.20వేల నుంచి రూ.50 వేల వరకూ కొందరు హైదరాబాద్ బెట్టింగ్ టీమ్స్తో పందేలు కాయడానికి వెనకాడటంలేదు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ల్లో ఎక్కువగా పందెం కాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఆస్తులు తాకట్టుబెట్టి.. అధిక వడ్డీలకు తెచ్చి..
ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ ముఠాలు అమాయకులను ఉసిగొల్పుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈజీ మనీ ఆశ చూపి బెట్టింగ్లోకి దింపుతున్నాయి. కొద్దిమంది అప్పులు చేసి మరీ ఈ బెట్టింగ్కు పాల్పడుతున్నారు. కొంతమంది ఏకంగా ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి జూదమాడుతున్నారు. బెట్టింగ్ టైంలో డబ్బులు లేకుంటే ఖాళీ ప్రామిసరీ నోట్ సంతకం లేదా బైక్స్, మొబైల్స్ను పెట్టుకుని రూ.10 మిత్తితో బెట్టింగ్ రాయుళ్లే డబ్బులను ఇస్తున్నారు. మరికొందరు బెట్టింగ్కు డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ఉదంతాలు లేకపోలేదు.
Also Read: Raghurama Krishnam Raju: విచారణకు ప్రభావతి సహకరించాల్సిందే.. రఘురామ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు