Spa Centers in Hyderabad: స్పా సెంటర్ల ముసుగులో మహానగరంలో విచ్చలవిడిగా గలీజ్ దందా జరుగుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను పిలిపించుకుంటున్న నిర్వాహకులు వారితో వ్యభిచారం జరిపిస్తున్నారు. క్రాస్ మసాజ్లు చేయిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ కొందరు పోలీసులు ప్రతీనెలా ఠంచనుగా ముడుపులు తీసుకుంటూ వీరి పట్ల చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటం.
ఎవరైనా స్పా ప్రారంభించాలనుకుంటే తప్పనిసరిగా సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. ఇక, మసాజ్ చేసేవారు ఫిజియోథెరపీ, ఆక్యూప్రెషర్, ఆక్యుపేషనల్ థెరపీల్లో అర్హులై ఉండాలి. ఇక, స్పాలో పని చేసే ప్రతీ ఒక్కరి వివరాలతో రిజిష్టర్ మెయింటైన్ చేయాలి. 18 సంవత్సరాల లోపు వయసున్న వారిని పనిలో పెట్టుకోకూడదు. సెంటర్ నిర్వాహకుని పేరు, లైసెన్స్ నెంబర్, పని వేళలు స్పష్టంగా తెలిసేలా డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి. ఏయే రకాల మసాజ్ సేవలు అందుబాటులో ఉన్నాయి? ఎంత రుసుము వసూలు చేస్తారు? అన్న వివరాలను కూడా డిస్ ప్లే బోర్డులో పేర్కొనాలి. ఇక, స్పా సెంటర్ ప్రవేశ ద్వారం వద్ద, రిసెప్షన్తో పాటు ఇతర ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. మూడు నెలలపాటు వీటి రికార్డింగ్ను భద్రపరచాలి. ఇక, స్పా సెంటర్లకు వచ్చే కస్టమర్ల పేరు, వారి ఫోన్ నెంబర్, ఏయే తేదీల్లో వచ్చారు? అన్న వివరాలతో రిజిష్టర్ మెయింటైన్ చేయాలి. పలువురు ఆయుర్వేద వైద్యులు తమ తమ హాస్పిటళ్లలో ఇలాగే స్పాలు నడిపిస్తున్నారు.
Also Read- Vijay Devarakonda: బ్లాక్ బస్టర్ డైరెక్టర్తో విజయ్ సినిమా.. కాంబో అదిరింది!
స్పా మాటున…
అయితే, కష్టపడకుండానే డబ్బు సంపాదించటానికి కొందరు స్పాల మాటున అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి లైసెన్సులు తీసుకోకుండానే స్పాలను తెరుస్తున్నారు. నెలకు 30 నుంచి 40 వేల రూపాయల జీతాలిస్తామంటూ ప్రధానంగా వెస్ట్ బెంగాల్, ముంబయి సిటీకి చెందిన యువతులను ఇక్కడికి పిలిపిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేకపోయినా వీరిని ఫిజియో థెరపిస్టులుగా పెట్టుకుంటున్నారు. కొందరు స్పా నిర్వాహకులైతే నేపాల్ దేశానికి చెందిన యువతులను కూడా ఇలాగే పిలిపించుకుని పనిలో పెట్టుకుంటున్నారు.
ఇలాంటివారు తమ తమ స్పాలలో క్రాస్ మసాజ్లే జరిపిస్తున్నారు. పురుషులకు యువతులతో, మహిళలకు యువకులతో మసాజ్లు చేయిస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. మరికొందరు స్పా సెంటర్లలో గదులు ఏర్పాటు చేసుకుని వ్యభిచార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. క్రాస్ మసాజ్కు 5వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్న వీళ్లు విటుల నుంచి 10 వేలు మొదలుకుని 15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు పట్టుబడి జైలుకు వెళ్లినా బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ ఇదే పని చేస్తున్నారు. ట్రై కమిషనరేట్ల పరిధుల్లో యేటా ఇలాంటి స్పా సెంటర్లపై పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం నెలకొని ఉన్న పరిస్థితికి దర్పణం పడుతుంది.
Also Read- Venkata Ramana Reddy: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది: గండ్ర వెంకటరమణారెడ్డి
ఇలా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి అవినీతికి మరిగిన కొందరు స్థానిక పోలీసుల అండదండలు ఉంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్లలో ఉండే అధికారులు నెలకింత అని మామూళ్లు మాట్లాడుకుని చూసీ చూడనట్టుగా ఉంటున్నారని పోలీసువర్గాలే చెబుతుండటం గమనార్హం. అక్రమ కార్యకలాపాలు సాగుతున్న స్పా సెంటర్ల గుట్టును అధికంగా టాస్క్ ఫోర్స్ పోలీసులే రట్టు చేస్తుండటం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
