తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ప్రపంచ లైఫ్ సైన్సెస్ హబ్గా (World Life Sciences Hub) హైదరాబాద్ మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతి ఏటా నిర్వహించే బయో ఏషియా సదస్సుతో (Bio Asia Summit) హైదరాబాద్కు గుర్తింపు వచ్చిందన్నారు. హెల్త్ కేర్ (Health Care) రంగం భవిష్యత్తును నిర్దేశించటంతోపాటు ప్రపంచానికే మార్గదర్శనం చేసేలా బయో ఏషియా సదస్సు.. దేశ విదేశాలను ఆకర్షిస్తున్నదని వెల్లడించారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో మంగళవారం బయో ఏషియా సదస్సును ముఖ్యమంత్రి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన ఫార్మా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఎన్నో హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయని తెలిపారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను అందించే సంస్థలను ప్రోత్సహించాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. తాము ఇంతకాలం ఉన్నత విద్యపై పెట్టుబడులు పెట్టామని, ఎందరో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఆయా రంగాల్లో శాస్త్ర నిపుణులు, ఇంజినీర్ల సమూహాన్ని తయారు చేశామని, జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసుకున్నామని ముఖ్యమంత్రి వివరించారు. రాబోయే పదేళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో సేవల రంగానికి ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు.
ఫ్యూచర్ సిటీ సహా అనేక భారీ ప్రాజెక్టులు
హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ (Future City), ఏఐ సిటీతో (AI City) పాటు ఎన్నో భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఇప్పుడు దేశంలో హైదరాబాద్ ఎలక్ట్రిక్ వాహనాల(EV) రాజధానిగా అవతరించిందని చెప్పారు. దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తెలంగాణలో జరుగుతున్నాయని తెలిపారు. 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. కోర్ సిటీ వెలుపల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు మాన్యుఫాక్చరింగ్ హబ్ అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద తయారీ కేంద్రాలలో ఒకటిగా దీన్ని నెలకొల్పుతామని స్పష్టం చేశారు. చైనా ప్లస్ వన్ అవసరాలు తీర్చే కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తామని, ప్రపంచం నలుమూలాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని ఉద్ఘాటించారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్.. ఈ రెండు రింగ్లను రేడియల్ రోడ్లతో అనుసంధానిస్తామని తెలిపారు. ఈ రహదారులకు ఇరువైపులా క్లస్టర్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
మెగా డ్రైపోర్ట్తో ఏపీలోని సీపోర్ట్కు అనుసంధానం
తెలంగాణ భూ పరివేష్టిత రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అందుకే ఇక్కడ ఒక మెగా డ్రై పోర్ట్ను అభివృద్ధి చేసి.. ఇక్కడి నుంచి ఏపీలోని సీ పోర్ట్కు అనుసంధానం చేసేలా ప్రత్యేక రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు మెరుగుపరుస్తామని అన్నారు. బయోసైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామని సీఎం వివరించారు. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, తయారీ, నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో పని చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లో అమ్జెన్ సంస్థ తన కార్యకలాపాలను ఈ నెల 24న విస్తరించిందని, ఇది మా సహకారానికి నిదర్శనం అని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, తమ ప్రభుత్వ సహకారాన్ని అందుకోవాలని, తమతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలకు ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. సులభమైన పారిశ్రామిక విధానం, మౌలిక సదుపాయాలు, ఆశించినంత మద్దతు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఇక్కడ అత్యల్ప ద్రవ్యోల్బణం, అత్యధిక ఉద్యోగాల కల్పన ఉందని తెలిపారు.
దావోస్లో 1.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు
ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు సందర్భంగా తెలంగాణ రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని, వీటితో విభిన్న రంగాల్లో దాదాపు 50 వేల ఉద్యోగాలు రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వివరించారు. గత ఏడాది లైఫ్ సైన్సెస్ రంగంలో రూ.40వేల కోట్లకు పైగా పెట్టుబడులను విజయవంతంగా ఆకర్షించామని తెలిపారు. దాదాపు 150పైగా ప్రాజెక్టుల్లో ఈ పెట్టుబడులు విస్తరించాయన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. 5 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ఆశిస్తున్నామని వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ కింద కీలకమైన గ్రీన్ ఫార్మా సిటీ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయన్నారు. జర్మన్ కంపెనీ మిల్టెని బయోటెక్ జీనోమ్ వ్యాలీలో తన సెల్, జన్యు చికిత్సను ప్రారంభించిందని సీఎం తెలిపారు. ఈ వేదికపై మరో 4 బహుళజాతి కంపెనీలను తమ పర్యావరణ వ్యవస్థలోకి స్వాగతిస్తున్నామన్నారు. గత 25 ఏళ్లలో హైదరాబాద్ ఫార్మా తయారీ, ఐటీ, డిజిటల్ హెల్త్ పవర్ హౌస్గా పేరు నిలుపుకొన్నదని చెప్పారు. గత ఏడాది ఏఐ హెల్త్కేర్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించామన్నారు. దేశవిదేశాల నుంచి బయో ఏషియా సదస్సుకు హాజరైన ప్రముఖులు.. తెలంగాణను అనువైన వేదికగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును పొందిన ప్రొఫెసర్ పాట్రిక్ టాన్ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.
తెలంగాణలో లైఫ్ సైన్సెస్ వర్సిటీ
తెలంగాణ లో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సంబంధిత పరిశ్రమల భాగస్వామ్యంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసేలా కోర్సులకు రూపకల్పన చేయబోతున్నామని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రపంచ పటంలో తెలంగాణను ప్రత్యేక స్థానానికి తీసుకెళ్ళిందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను నంబర్ వన్గా మార్చడంలో
“జీనోమ్ వ్యాలీ” పాత్ర కీలకమని మంత్రి తెలిపారు. హార్ట్ ఆఫ్ ది లైఫ్ సైన్సెస్” జీనోమ్ వ్యాలీని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టి… రాష్ట్రాభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమల ఏర్పాటు తోనే ఆగిపోబోమని, రాష్ట్ర ప్రభుత్వం వారితో కలిసి పని చేస్తుందని చెప్పారు. యూనివర్సిటీలు, స్టార్టప్, పరిశోధన సంస్థలతో భాగస్వామ్యం అయ్యేలా ప్రోత్సహిస్తామని, కొత్త ఆలోచనలకు అండగా ఉంటామన్నారు. ఎంఎస్ఎంఈ లను ప్రోత్సహించి లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత వృద్ధి పథంలోకి తీసుకెళ్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న జనరిక్ మందులు, వ్యాక్సిన్లలో తెలంగాణ వాటా రోజురోజుకూ పెరుగుతున్నది. 200కు పైగా దేశాలకు ఏటా 5 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయని మంత్రి శ్రీధర్బాబు వివరించారు. ఏఐ, క్వాంటం, రోబోటిక్స్ తదితర నూతన టెక్నాలజీల సాయంతో రోగుల అవసరాలకు అనుగుణంగా, వారికి త్వరగా సాంత్వన చేకూరేలా ఔషధాల సామర్థ్యాన్నిపెంచే పరిశోధనలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి వ్యయంతో మౌలిక సదుపాయాల పరంగా హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చి దిద్దుతామని వెల్లడించారు.