Football Match Funds: కారకులను బొక్కలో వేయిస్తామ్
సింగరేణిలో ఇండిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలి
మెడికల్ బోర్డు పెట్టి సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి
లేకుంటే ప్రజాభవన్ ముట్టడి చేస్తాం: మాజీ మంత్రి హరీష్ రావు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఇటీవల మెస్సీ పర్యటన సందర్భంగా నిర్వహించిన ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించడానికి రూ.110 కోట్లు వాడారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంపై ఎంక్వయిరీ వేసి కారకులను జైలుకు పంపిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) హెచ్చరించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై సింగరేణి డైరెక్టర్ గౌతమ్ను శనివారం సింగరేణి భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ నేతలతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను సింగరేణి డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో చంద్రబాబు డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేస్తే ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలను కేసీఆర్ పునరుద్ధరించరన్నారు. 40 వేల సింగరేణి ఉద్యోగుల్లో 20 వేల మంది డిపెండెంట్ ఉద్యోగులే.. వారిని నియమించి ఉద్యోగులను, సంస్థను కాపాడింది కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
‘‘నెలకు రెండు సార్లు మెడికల్ బోర్డు, అలియాస్ పేర్లను పరిగణిస్తామంటూ హామీలను ఇచ్చి రెండేళ్లలో రెండు సార్లు మెడికల్ బోర్డు పెట్టారు. కార్మికులపై పగపట్టినట్టు వ్యవహరిస్తున్నారు. కాళ్ళు లేని వారిని, కండ్లు కనిపించని వారిని, గుండెకు బైపాస్ సర్జరీ అయినా వారిని కూడా ఉద్యోగం చెయ్యాలని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. కార్మిక కంటక ప్రభుత్వం. కార్మికులను గోసపెట్టుకునే ప్రభుత్వం, మానవత్వం లేని ప్రభుత్వం. తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్దరించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నాం. సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుంది. కరెంట్కు బొగ్గును తీసుకోని బిల్లులు చెల్లించడం లేదు. సింగరేణి అప్పుల పాలయ్యే పరిస్థితి. జీతాలకు డబ్బులు లేక ఓడీ తీసుకుని జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొంది’’ అని హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో సింగరేణికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క తక్షణమే మెడికల్ బోర్డు పెట్టి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి లేదంటే వారందరితో నీ ఇల్లు ముట్టడి చేస్తాం అని హెచ్చరించారు.
Read Also- Shambala Movie: హిందీ డబ్బింగ్కు సిద్ధమవుతున్న ఆది ‘శంబాల’.. అక్కడ రిలీజ్ ఎప్పుడంటే?
రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ లను ఖండిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నారు. ‘‘ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు. ఉక్కు పాదంతో అణిచివేస్తున్నారు. వారికి ధర్నా చేసే హక్కు లేదా, దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా?. ఇదేనా మీరు ఇస్తానన్న ఏడవ గ్యారంటీ. జర్నలిస్టులకు కేసీఆర్ 26,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. రిపోర్టింగ్ జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు అనే తేడా లేకుండా అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఇండ్లు ఇస్తాం. ఇంటి స్థలాలను ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అక్రిడేషన్ కార్డులను 10 వేలకు తగ్గించడం దుర్మార్గం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను టెర్రరిస్టులుగా పోల్చడం దారుణం. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు తెలుపుతుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని హరీష్ రావు పేర్కొన్నారు.

