Government Aims: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న ప్రభుత్వం, విద్యాశాఖ లక్ష్యం త్వరలోనే నెరవేరనున్నది. నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) (AI) ఆధారిత ప్లాట్ఫారమ్తో ప్రస్తుతం 540 పాఠశాలలలో పనిచేస్తుండగా ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కి పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనున్నదని విద్యాశాఖ స్పష్టం చేసింది. మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్ను ఈ సంస్థ విద్యార్థులకు అందించనున్నది.
సాంకేతిక బోధన సేవలను ఉచితం
ఈ మేరకు జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanh Reddy) నివాసంలో ఆరు ఎన్జీవో సంస్థలైన నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకున్నది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఈ ఎంవోయూ కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్ టెక్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది.
Also Read: Local Elections: స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం!
పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఫిజిక్స్ వాలా ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయనుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనుంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10 తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేయనుంది.
కంప్యూటేషనల్ థింకింగ్పై శిక్షణ
డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నది. పై జామ్ ఫౌండేషన్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్పై శిక్షణను అందించనున్నది. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడంతో పాటు, బాలికల అక్షరాస్యత మరియు విద్యా అవకాశాలను మెరుగుపరచనున్నది.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రెటరీ హరిత, ఏక్స్టెప్ ఫౌండేషన్ సీఈవో జగదీష్ బాబు, ప్రజ్వల ఫౌండేషన్ చీఫ్ డాక్టర్ సునీతా కృష్ణన్, ఫిజిక్స్ వాలా కో ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి, ఖాన్ అకాడమీ ఇండియా ఎండీ స్వాతి వాసుదేవన్, పైజామ్ పౌండేషన్ ఫౌండర్ షోయబ్ దార్, ఎడ్యుకేట్ గర్ల్స్ సీఈవో గాయత్రి నాయిర్ లోబో తదితరులు పాల్గొన్నారు.
Also Read: Dil Raju: ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే.. తీసుకోవడానికి రారా? దిల్ రాజు ఫైర్!