Stem Borer: యాసంగి వరి పైరుకు మొగి (కాండం తొలిచే పురుగు) తీవ్ర నష్టం చేస్తున్నది. ఈ పురుగును అరికట్టేందుకు ఎన్ని క్రిమిసంహారక మందులు వాడినా ఉపయోగం ఉండటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పిలకదశ నుంచి పొట్ట దశకు వస్తున్నది. ఈ దశలో మొగిపురుగు తీవ్ర నష్టం చేస్తున్నదని రైతులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట్, గజ్వేల్, దౌల్తాబాద్, రాయపోల్, జగదేవ్ పూర్, వర్గల్ తదితర మండలాల్లో మొగిపురుగు ప్రభావం ఎక్కువగా ఉంది. నాటువేసిన పది రోజుల నుండి ఈ పురుగు ప్రభావం కనిపిస్తుండగా పొట్ట కొచ్చే దశ వరకు నష్టం కలిగిస్తున్నట్లు చెప్తున్నారు. గత రెండు మూడేండ్లుగా సిద్దిపేట జిల్లాలోని అనేక గ్రామాల్లో ఈ పురుగు ప్రభావం వల్ల పట్ట నష్టం జరుగుతున్నట్లు చెప్తున్నారు.
పురుగు ప్రభావం
వరుసగా వరి సాగు చేసిన పొలాల్లో, మొక్కజొన్న, కూరగాయ పంటలు సాగు చేసిన పొలాల్లో మొగిపురుగు ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు రైతులు చెప్తున్నారు. పిలకలు ప్రారంభం కాగానే మొగిపురుగు తినడంతో అవి ఎండిపోతున్నాయని పురుగు తీవ్రమైతే పొలమంతా వరి దుంపలు చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. పొట్టదశ వరకు ఈ పురుగు ప్రభావం ఉంటుందని వరి ఈనిన తర్వాత తెల్లకంకులు వస్తున్నాయని చెప్తున్నారు. నారుమడిలో తల్లి రెక్కల పురుగులు, గుడ్ల సముదాయం కనిపిస్తే పురుగు ఉధృతి పెరుగుతున్నట్టు రైతులు చెబుతున్నారు. నాటు వేసిన పొలంలో కూడా తల్లి పురుగులు నీళ్లలో పడి చనిపోయినట్లు కనిపిస్తాయి. కొంగలు, ఇతర చిన్న పక్షులు ఈ పురుగుల కోసం పొలంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని అని రైతులు చెప్తున్నారు.
నివారణ కోసం ఏం చేయాలి?
మొగిపురుగు నివారణ కోసం నారు మడిలో 3జీ గులికలు చల్లడంతోపాటు నాటే కొన్ని రోజుల ముందు క్లోర్ పైరిపాస్ మందును పిచికారి చేస్తే ఈ పురుగు ప్రభావం తగ్గించవచ్చని చెబుతున్నారు. నాటిన వరికి 3జీ గుళికలు, క్లోరిపైరిఫాస్ మందుతోపాటు కార్టాప్ హైడ్రో క్లోరైడ్, ఫాస్పామిడాన్ తదితర క్రిమిసంహారక మందులు వాడాలని సూచిస్తున్నారు. అయితే రైతులు వీటితోపాటు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల కొత్త సాంకేతికతతో వచ్చిన క్రిమి సంహారక మందులు, గుళికలు వాడుతున్నారు. అయినా ప్రయోజనం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రకాల 3జీ, 4జీ గుళికలను వాడుతున్నారు. క్లోరిపైరీఫాస్ తో పాటు కోరాజిన్, హంప్లిగో, సాఫ్ లంమ్డా లాంటి అధిక మోతాదు మందులను వాడినప్పటికీ కంట్రోల్ కావడం లేదని చెప్తున్నారు. కొంతమంది రైతులు వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ పురుగు నివారణ కోసం హైరానా పడుతున్నారు. పురుగు నివారణకు ఎకరాకు రూ. 5,000 నుంచి రూ. 8,000 వరకు ఖర్చు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు.