తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) స్పష్టం చేశారు. వామపక్షాలు పోటీ చేసే స్థానాల్లో మాత్రం పరస్పరం సహకరించుకుంటామన్నారు. ప్రజా ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్యూజే) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో పాల్గొని పలు అంశాలపై స్పందించారు.
ఈ సందర్భంగా జాన్ వెస్లీ (John Wesley) మాట్లాడుతూ.. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముమ్మాటికీ పేదలకు వ్యతిరేకంగా ఉందన్నారు. దేశంలోని పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందాలన్నదే సీపీఎం విధానమన్నారు. కానీ ఈ రెండు రంగాలను ప్రైవేట్ పరం చేయాలని మోడీ సర్కార్ కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. దేశంలో వేల ఏండ్లుగా కులవివక్ష, రాజకీయ, సామాజిక అసమానతలు కొనసాగుతుంటే పాలక పక్షాలు వాటిని తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలంటే దేశంలోని లౌకికశక్తులు మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్లో వ్యవసాయ రంగానికి గతంలో కంటే రూ.10 వేల కోట్లు తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు.
జనాభాలో 16 శాతం ఉన్న దళితులకు కేవలం ఐదు శాతం, ఏడు శాతమున్న ఎస్టీలకు కేవలం 2 శాతం నిధులు కేటాయించడం దారుణమని జాన్ వెస్లీ విమర్శించారు. 50 శాతానికిపైగా జనాభాగా ఉన్న బీసీలకు బడ్జెట్లో సరైన కేటాయింపులు లేవన్నారు. బీఆర్ఎస్ పార్టీ మతతత్వ రాజకీయాలపై తన వైఖరేంటో చెప్పకుండా అవకాశవాదంతో ముందుకెళ్తున్నదని విమర్శించారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తాను సామాజిక సమీకరణాలతో ఈ పదవిలోకి రాలేదనీ.. సీపీఎం మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కార్యదర్శిని అయ్యానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్ఎస్ హష్మీ, టీడబ్ల్యూజేఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ బసవ పున్నయ్య, రాష్ట్ర కార్యదర్శులు చంద్రశేఖర్, సలీమా, గుడిగ రఘు, హెచ్యూజే అధ్యక్షుడు అరుణ్కుమార్, ప్రధాన కార్యదర్శి బీ జగదీశ్, కోశాధికారి రాజశేఖర్, నాయకులు విజయ తదితరులు పాల్గొన్నారు.