తెలంగాణ: Gold Tiffin Box Case: మహ్మద్ గౌస్ ఎలియాస్ ఖూనీ గౌస్ మామూలోడు కాదు. పాతబస్తీలోని నిజాం మ్యూజియం నుంచి నిజాం నవాబు వాడిన బంగారు టిఫిన్ బాక్స్ ను తస్కరించిన ఘనుడు. కొంతకాలం క్రితం ఓ హత్య కేసులో అరెస్టయిన మహ్మద్ గౌస్ కు 9వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి యావజ్జీవ కారగార శిక్ష, 10వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాతబస్తీకి చెందిన మహ్మద్ గౌస్ చెడు సావాసాలతో చిన్నతనం నుంచే నేరాలు చేయటం మొదలు పెట్టాడు.
యుక్తవయసు వచ్చేసరికి సిటీ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. కాగా, 2018, సెప్టెంబర్ లో పాతబస్తీలోని నిజాం మ్యూజియం చూడటానికి మహ్మద్ గౌస్ స్నేహితునితో కలిసి వెళ్లాడు. అయితే, అతని దుస్తులు, వాలకం చూసిన సెక్యూరిటీ సిబ్బంది మహ్మద్ గౌస్ ను వెనక్కి పంపించి వేశారు. దీనిని అవమానంగా భావించిన మహ్మద్ గౌస్ పక్కాగా రెక్కీ చేసి మ్యూజియంలోకి రాత్రి వేళ చొరబడ్డాడు. ఆఖరు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వాడిన వజ్రాలు పొదిగి ఉన్న బంగారు టిఫిన్ బాక్స్ ను అపహరించాడు.
Also Read: Ponnam Prabhakar: సమ్మె వద్దు మాకు సహకరించండి.. మంత్రి పొన్నం!
ఆ తరువాత ముంబయికి పారిపోయాడు. అక్కడ కొన్ని రోజులపాటు ఉన్న మహ్మద్ గౌస్ అదే టిఫిన్ బాక్స్ లో అన్నం పెట్టుకుని తిన్నాడు. ఆ తరువాత హైదరాబాద్ తిరిగొచ్చి పోలీసులకు లొంగిపోయాడు. చోరీ చేసిన నిజాం నవాబు బంగారు టిఫిన్ బాక్స్ ను అప్పగించాడు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన మహ్మద్ గౌస్ బెయిల్ పై విడుదలైన తరువాత నేరాలు చేయటాన్ని కొనసాగించాడు. కాగా, రాజేంద్రనగర్ నివాసి సవర్ ఖాన్ తో అతనికి పాతకక్షలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో 2023లో ఇద్దరు సహచరులతో కలిసి సవర్ ఖాన్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో మహ్మద్ గౌస్ తోపాటు అతని సహచరులను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన జడ్జి హత్యకు పాల్పడ్డ మహ్మద్ గౌస్ కు యావజ్జీవ కారాగార శిక్ష, 10వేల రూపాయల జరిమానా విధించారు. అతని ఇద్దరు సహచరులకు కూడా జైలు శిక్ష వేశారు.
స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/