Congress on KCR: తెలంగాణను పదేళ్ల పాటు నిర్విరామంగా పరిపాలించిన విపక్ష బీఆర్ఎస్ పార్టీ (BRS Party).. ప్రస్తుతం దీన పరిస్థితుల్లో ఉంది. నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న కార్యకర్తల్లో కొత్త జోష్ నింపేందుకు.. ఆ పార్టీ అధినేత కేసీఆర్.. రజతోత్సవ సభకు శ్రీకారం చుట్టారు. వరంగల్ (Warangal)లోని ఎల్కతుర్తి (Elkathurthy)లో ఈ నెల 27న భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. అయితే వరంగల్ లో సభను ఏర్పాటు చేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
వరంగల్ కు ఏం చేశారు?
గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. వరంగల్ అభివృద్ధికి ఏం చేసిందని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్ పలానాది చేశామని ఒక్కటైన చెప్పుకోగలరా? అంటూ నిలదిస్తున్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా పేరొందిన వరంగల్ అభివృద్ధి.. గత బీఆర్ఎస్ పాలనలో అటకెక్కిందని ఆరోపిస్తున్నారు. వరంగల్ రూరల్ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి అద్వాన్నం చేశారని మండిపడుతున్నారు. గ్రేటర్ వరంగల్ లోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయని.. చినుకు పడితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయంటూ నిలదీస్తున్నారు. నగర అభివృద్ధికి కావాల్సిన నిధులను గత ప్రభుత్వం కేటాయించలేదని.. నిర్లక్ష్యంగా వ్యహరించిందని కాంగ్రెస్ శ్రేణులు నెట్టింట ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?
పదేళ్లు అధికారంలో ఉండగా కేసీఆర్ దొరకు వరంగల్ గుర్తుకు రాలేదని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అధికారం పోగానే వరంగల్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని నిలదీస్తున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పాలనలో వరంగల్ కు ఏర్పడ్డ దుస్థితి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. నమ్మి ఓరుగల్లు ప్రజలు ఓట్లు ఓస్తే.. అభివృద్ధి పట్టనట్లు కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అప్పట్లో వచ్చిన మీడియా కథనాలను ఒక చోటకు చేర్చి వైరల్ చేస్తున్నారు.
పదేళ్ల అధికారంలో
ఎన్నడూ వరంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదుఅధికారం పోగానే దొరకు వరంగల్ గుర్తొచ్చింది…#BRSNeglectedWarangal pic.twitter.com/UBnVV6Lb8u
— Marpu Modalaindi (@Marpu_TG) April 25, 2025
కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని (Congress Govt) ఆ పార్టీ శ్రేణులు ఆకాశానికెత్తుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో దాదాపు రూ.2,44,962 కోట్లు పెట్టుబడులను తీసుకొచ్చినట్లు ప్రశంసిస్తున్నారు. దావోస్ (Davos), జపాన్ (Japan) పర్యటనల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పెట్టుబడులను తీసుకొచ్చారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఆ పర్యటన ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 80,500 ఉద్యోగాలు తెలంగాణకు రాబోతున్నాయని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటో తాజా గణాంకాలే చెబుతాయని స్పష్టం చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan – Varma: వర్మ వచ్చెన్.. సమస్య తీర్చెన్.. పవన్ పర్యటనతో ఫుల్ జోష్!
సభకు ముమ్మర ఏర్పాట్లు
వరంగల్ లోని ఎల్కతుర్తి ప్రాంతం బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్ధమవుతోంది. సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 200 ఎకరాల్లో సభా ప్రాంగణం, సుమారు 40 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ సౌకర్యం, 10 లక్షల మంచి నీటి బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 100 వైద్య బృందాలను బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు విద్యుత్ కు అంతరాయం లేకుండా 200 జనరేటర్లను ఏర్పాటు చేసుకుంటున్నట్లు కేటీఆర్ స్వయంగా వెల్లడించారు.