CM Revanth Reddy: క్షేత్రస్థాయి పరిస్థితులు, అధ్యయనం, భవిష్యత్ అవసరాలకు తగినట్లు రూపొందించే తెలంగాణ విద్యా విధానం భారతదేశ విద్యా విధానానికి దిక్సూచిలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ప్రస్తుత విద్యావిధానంలో భాష ఉన్నవారి వద్ద జ్ఞానం లేదని, జ్ఞానం ఉన్నచోట భాష లేదని, రెండు ఉన్న చోట నైపుణ్యాలు లేవని, అందుకే.. ఈ మూడింటి కలబోతగా విద్య ఉండాలని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ విద్యావిధానం నివేదిక రూపకల్పనపై సెక్రటేరియట్లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వాలు భూముల పంపకం, ఇతర కార్యక్రమాలు చేపట్టలేదని, కానీ ఇప్పుడు పేదరిక నిర్మూలనకు విద్య తప్ప మరో ఆయుధం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: Kavitha: ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ .. కవిత సంచలన కామెంట్స్
తగినంత నైపుణ్యం లేకపోవడమే కారణం
పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ రంగంలో తెలంగాణ యువత రాణిస్తున్నారని సీఎం తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రం నుంచి ఏటా బయటకు వస్తున్న లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు దక్కడంలేదన్నారు. తగినంత నైపుణ్యం లేకపోవడమే అందుకు కారణమన్నారు. విద్యార్థుల రాకపోకలు, తగిన శ్రద్ధ చూపుతారనే కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారని సీఎం తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ఆ రకమైన ధీమా కల్పించగలిగితే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చుతారని వెల్లడించారు. మన చదువులు భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో ఉండాలని సీఎం స్పష్టంచేశారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం
దేశంలో ఐటీఐలు ప్రారంభించినప్పుడు ఉన్న డీజిల్ ఇంజిన్ మెకానిక్, ఫిట్టర్ వంటి సంప్రదాయ కోర్సులే నేటికీ ఐటీఐల్లో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అవసరమైన నైపుణ్యాలు అందించే కోర్సులను అందించేందుకు ఐటీఐల్లో కోర్సులను మార్చామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని సీఎం వివరించారు. ఇప్పటివరకు విద్యారంగంపై తాము చేసిన కృషితో తాము సంతృప్తి చెందడంలేదని.. అందుకే ప్రాథమిక దశ నుంచి యూనివర్సిటీల వరకు సమూల ప్రక్షాళన చేయాల్సి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. రానున్న 25 ఏండ్ల వరకు విద్యా వ్యవస్థకు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాలని సీఎం అన్నారు.
డిసెంబరు 9న ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో తెలంగాణ విద్యా విధానానికి చోటు కల్పిస్తామని సీఎం వెల్లడించారు. విద్యా విధానంపై ఎంత వ్యయానికైనా తాము వెనుకాడబోమని సీఎం స్పష్టంచేశారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, ప్రమాణాల మెరుగుకు ఖర్చు చేయాలని నిర్ణయించామని తెలిపారు. విద్యపై చేసే వ్యయాన్ని వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. విద్యాభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బీఎం పరిమితి నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కోరామన్నారు.
తెలంగాణ విద్యా విధానం చైర్మన్ కేశవరావు మాట్లాడుతూ..
విద్యా కమిషన్, ఇతర భాగస్వాములతో తాము విస్తృత సంప్రదింపులు చేశామన్నారు. గణాంకాల కన్నా నాణ్యత ప్రధానమని, విద్యార్థి కేంద్రంగా బోధన ఉండాలనేది తమ అభిప్రాయమన్నారు. ఏఐ వంటివి ఎన్ని వచ్చినా అవి గురువుకు ప్రత్యామ్నాయం కావని వివరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐవీ సుబ్బారావు మాట్లాడుతూ.. దేశ యువతలో మూడో వంతు నీట్(ఎన్ఈఈటీ)గా ఉన్నారని, దాని అర్ధం నాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ అని ఓ సర్వే తేల్చిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతుల పెంపునకు చేసిన కృషి అభినందనీయమన్నారు. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తాము స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్నామని, ఒక్క ఏడాదిలో 180 పేటెంట్లు పొందామని సీఎంకు తెలిపారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. విద్యావిధానం కొలువుల సాధనకే కాకుండా అత్యుత్తమ మానవుడిగా తీర్చిదిద్దేదిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, విద్యావేత్తలు మోహన్ గురుస్వామి, ప్రొఫెసర్ సుబ్బారావు, సీఐఐ శేఖర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఫ్రొపెసర్ గంగాధర్, విశ్రాంత ఐఏఎస్లు మిని మాథ్యూ, రంజీవ్ ఆచార్య, ప్రొఫెసర్ శాంతా సిన్హా తదితరులు మాట్లాడారు. కాగా ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, అధికారులు జయేశ్ రంజన్, శ్రీదేవసేన, కృష్ణ ఆదిత్య, నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: TGPSC: గ్రూప్ 1పై కీలక నిర్ణయం.. సింగిల్ బెంచ్ తీర్పును విజన్ బెంచ్ లో అప్పీల్ చేసిన టీజీపీఎస్సీ