Cm Revanth : కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు (Telangana) తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కృష్ణా బేసిన్ లో ఏపీ ప్రభుత్వమే ఎక్కువ నీటిని తీసుకుంటోందని.. ఈ లెక్కన తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా బేసిన్ లో ఏపీ, తెలంగాణ నీటి వాటాల లెక్కలను తేల్చాలని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నిర్మించాలని చూస్తున్న బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని.. తెలంగాణ నీటి ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాతనే ఏపీ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు.
ఇక రేవంత్ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో (Uttam kumar Reddy) కలిసి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి, తెలంగాణకు మధ్య గోదావరి నికర జలాల మీద అసలు ఎలాంటి కేటాయింపులు జరగలేదన్నారు. తెలంగాణకు నీటి పంపకాల విషయంలో ఇప్పటికే చాలా అన్యాయం జరుగుతోందని.. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు తెలంగాణ ప్రాజెక్టుల తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిని ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలను చెప్పడం మంచిది కాదన్నారు.
తెలంగాణలో సీతారామ, పాలమూరు, రంగారెడ్డితో సహా ఐదు ప్రాజెక్టులకు నిధులు అడిగినట్టు సీఎం రేవంత్ వివరించారు. టెలిమెట్రీల ఏర్పాటును త్వరగా కంప్లీట్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.