CM Revanth on HCA: హెచ్ సీఏ వివాదంపై ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. పాసుల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు యాజమాన్యాన్ని వేధిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే ఐపీఎల్ 18వ ఎడిషన్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరుగుతున్న మ్యాచులన్నీ ఆసక్తికరంగా సాగుతున్నాయి. వీటిని చూడటానికి వేలాది మంది అభిమానులు ఆయా గ్రౌండ్లకు పోటెత్తుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు ఫ్రీ పాసుల కోసం తమను వేధిస్తున్నాయంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆరోపించినట్టుగా ఇటీవల వార్తలొచ్చాయి. ఫ్రీ పాసుల కోసం బెదిరిస్తే హైదరాబాద్ ను వదిలి వెళ్లి పోతామని కూడా ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేసినట్టుగా మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.
తాజాగా ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association)పై వచ్చిన ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి (Kothakota Srinivas Reddy) ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు ముఖ్యమంత్రి కార్యాలయం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కొన్ని వివరాలను కూడా సేకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యాని ఫ్రీ పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
Also Read: Pithapuram News: డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో ఆటో దందా.. బెంబేలెత్తుతున్న ప్రజలు!
మరోవైపు వివాదంపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు స్పందించాయి. ఫ్రీ పాసుల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యాన్ని వేధించామంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపాయి. హైదరాబాద్ ను విడిచిపెట్టి వెళ్లి పోతామంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నుంచి ఎలాంటి ఈ మెయిల్ తమకు అందలేదని స్పష్టం చేశాయి. దీని వెనక కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశాయి. నిజంగా ఇలాంటి ఈ మెయిళ్లు వచ్చి ఉంటే ఆ సమాచారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లేదా హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యానికి చెందిన అధికారిక ఈ మెయిళ్ల నుంచి బయటకు వచ్చి ఉండేవన్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరు పనిగట్టుకుని ఈ విధమైన దుష్ప్రచారాన్ని చేస్తున్నాయని వ్యాఖ్యానించాయి.