Chilli Farmers: గత సీజన్లతో పోలిస్తే ప్రస్తుత మిరప పంటల దిగుబడులు క్షీణించి రైతులు దిగులు చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా ధరలు పెరుగుతుండడంతో వారికి కొంత ఊరట నిస్తోంది. గత మూడేళ్లుగా మిరపలో తెగుళ్లు, వైరస్ వ్యాప్తితో రైతులు కుదేలవుతున్నారు. ఫలితంగా పంట దిగుబడి రాక ఆశించిన ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కర్ణాటక తో పాటు తెలంగాణలో గత రెండు నెలల రక్తం మొంతా తుఫాన్ ప్రభావంతో తోటలు కొంతమేర దెబ్బతిన్నాయి. సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు తెగుళ్ల బెడద కారణంగా పంట దిగుబడులు అమాంతం పడిపోయాయి. దీంతో మిర్చి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.
మూడు సంవత్సరాల తర్వాత
గత మూడు సంవత్సరాలుగా మిర్చి సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడులు రాక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. వాణిజ్య పంట అయిన మిర్చి పంట సాగుకు అలవాటు పడ్డ రైతు ప్రతి యేటా సాగుకు మొగ్గు చూపుతాడు. తెగుళ్లు, బ్లాక్ త్రిప్స్ ఉధృతి ఎక్కువ అవుతోంది.వైరస్ ,ఫంగస్ వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో సాగు చేస్తే దిగుబడులు వచ్చి ధరలు అనుకూలిస్తే ఈ పంటలో అధిక ఆదాయం వస్తుందని ఆశతో పంట సాగుకు అనుకూలంగా ఉన్న పొలాల రైతులు ఈ పంటను సాగు చేస్తారు. ఎకరాకు 60 నుంచి 80 వేల వరకు పెట్టుబడుల రూపంలో విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు కలుపులకు ఖర్చు అవుతాయి.
పెరిగిన ధరలు
జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 26 వేలకు పైగా ఎకరాలలో సాగు చేస్తున్నారు. అలంపూర్ పరిధిలోని మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, ఉండవల్లి మండలాలలో నల్లరేగడి నేలల్లో సూపర్ టెన్ పంటను సాగు చేస్తున్నారు. ఎర్ర రేగడి నేళ్లలో 341, డీలక్స్, తేజ, బంగారం,బ్యాడిగ రకాలను సాగు చేస్తారు. గత మూడు సంవత్సరాలుగా 10 నుంచి 15 వేలు ధర ఉండగా, ప్రస్తుత సంవత్సరం సైతం 341 రకం గత రెండు నెలల క్రితం వరకు 15 వేల వరకు ఉండేది. ప్రస్తుతం అదే రకం మిర్చికి క్వింటాకు రూ.23 వేలు పలుకుతోంది.
Also Read: Seethakka: రాజ్యాంగాన్ని గౌరవించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన సాగిస్తోంది.. మంత్రి సీతక్క!
ఎల్లోమిర్చికి 45000
మిరప సాగులో కొందరు రైతులు ఎల్లో రంగు మిర్చి సాగు చేస్తున్నారు సీజన్ ప్రారంభంలో 15 16000 ఉండగా ప్రస్తుతం అత్యధికంగా 45 వేలకు కొనుగోలు చేస్తున్నారు. తేజ రకానికి సైతం ధరలు పెరిగాయి. గత వారం రోజులకు 16000 ఉండగా ప్రస్తుతం 22 వేల వరకు పెరుగుదల ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డీలక్స్ రకంకు ధర 25 వేల వరకు ఉంది. అలాగే 2043 బ్యాడిగ రకం 25 వేల నుంచి 38 వేల వరకు కాయ నాణ్యతను బట్టి పలుకుతోంది. అదేవిధంగా డబ్బి బ్యాడ్గాకు 50 వేల వరకు ధర పెరిగింది.
గత మూడేళ్లుగా ధరలు లేవు: నరసింహ, కురవపల్లి
మేము ప్రతి ఏటా మిరప పంటను సాగు చేస్తాము గత మూడేళ్లుగా పంటకు తెగుళ్ల కారణంగా దిగుబడులతోపాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నాం. మా గ్రామంలో ప్రతి రైతు మిరప పంట సాగుకు ఆసక్తి చూపుతారు. ఈ పంట సాగుకు పెట్టుబడులు అధికం అవుతున్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిరపకు కనీస మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలి. ప్రస్తుత ధరల పెరుగుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నాం.
దిగుబడులు తగ్గాయి: శ్రీరాములు రైతు
మేము సాగు చేసిన 5 ఎకరాలలో మిరప పంటకు తెగుళ్ల కారణంగా దిగుబడులు తగ్గాయి. ఇప్పటికే పంటలు చివరి దశకు వచ్చాయి. ప్రస్తుత తరుణంలో ధరలు పెరగడం సంతోషకరమే. పెట్టుబడులలో కొంత మేరకు ధరల పెరుగుతో నష్టాలను తగ్గించుకోగలుగుతాం.

