Sammakka Sagar Project: గోదావరి నదిపై సమ్మక్కసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేదని (NOC) మంజూరు చేయడానికి ఛత్తీస్గఢ్(Chhattisgarh) ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి(CM Vishnudeo Sai) సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. రాయపూర్లో ఛత్తీస్గఢ్ సీఎంను సోమవారం తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumara Reddy) సీనియర్ అధికారులతో కలిసి భేటీ అయ్యారు. సమక్కసాగర్ ప్రాజెక్టుపై చర్చించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీఎం విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించడం సంతోషంగా ఉందని, సమక్కసాగర్ ప్రాజెక్టు సాధనలో ఒక సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అడుగుగా అభివర్ణించారు.
ములుగు జిల్లాలోని తుపాకులగూడెంలో..
ఛత్తీస్గఢ్లో భూసేకరణ, పరిహారం మరియు పునరావాస బాధ్యతను పూర్తిగా తెలంగాణ తీసుకుంటుందని వివరిస్తూ ఒక పత్రాన్ని అందజేశామన్నారు. ఎన్ఓసీ అనేది కేంద్ర జల సంఘం ఆమోదం పొందడానికి అవసరమైన చివరి అంతర్రాష్ట్ర అనుమతిగా ఉందని, అది లేకుండా ప్రాజెక్టు ముందుకు సాగలేదని స్పష్టం చేశారు. పవర్పాయింట్ ప్రెజెంటేషన్లో సమ్మక్కసాగర్ బ్యారేజ్ ములుగు జిల్లాలోని తుపాకులగూడెంలో నిర్మాణంలో ఉందని వివరించారు. +83 మీటర్ల పూర్తి రిజర్వాయర్ లెవల్ వద్ద 6.7 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపకల్పన చేయబడిన ఈ ప్రాజెక్టు, ఇంద్రావతి సంగమం దిగువన గోదావరి నదిపై ఉందన్నారు. తెలంగాణలో బీడు, ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలైన నల్గొండ, వరంగల్లోని నీటి అత్యవసర అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టు రూపొందించామన్నారు. తాగునీటి కొరతను మాత్రమే కాకుండా భారీ స్థాయిలో సాగునీటి ప్రయోజనాలను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుందని వెల్లడించారు.
అధిక ఫ్లోరైడ్ కారణంగా..
ప్రాజెక్టు ప్రణాళికల ప్రకారం, సమ్మక్కసాగర్ ప్రాజెక్టు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–II కింద 1.78 లక్షల హెక్టార్ల ఆయకట్టును సాకులోకి తెస్తుందని, రామప్ప–పాకాల లింక్ కెనాల్ కింద 12,146 హెక్టార్ల కొత్త ఆయకట్టును సృష్టిస్తుందని, ఈ అదనపు సాగునీటి సామర్థ్యం వరంగల్(Warangal), సూర్యాపేట(Surayapet), మహబూబాబాద్(Mahabubnagar), జనగామ(janagon), ఖమ్మం(Khammam), నల్గొండ(Nalgonda)కు అందుతాయన్నారు. రైతులు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న అనిశ్చిత పరిస్థితులకు ఇది పరిష్కారం అవుతుందని తెలిపారు. నల్గొండ , వరంగల్లోని కొన్ని ప్రాంతాలు అధిక ఫ్లోరైడ్ కారణంగా భూగర్భజల కలుషితం వల్ల చాలా కాలంగా ప్రభావితమవుతున్నాయని తెలిపారు. భూగర్భజలంపై ఆధారపడడం తగ్గించడానికి గోదావరి ఆధారిత సురక్షితమైన నీటిని అందించడానికి సమ్మక్కసాగర్ ప్రాజెక్టు రూపకల్పన చేయబడిందన్నారు. సాగునీరు, తాగునీటి అవసరాలను ఒకే సమయంలో తీర్చడం ద్వారా తెలంగాణలోలక్షలాది మందికి ఈ ప్రాజెక్టు ప్రాణాధారంగా మారుతుందని భావిస్తున్నామన్నారు.
Also Read: Viral News: అసభ్యకర వీడియోలు చూస్తూ డ్రైవింగ్.. చివరికి ఏం జరిగిందంటే
భూపాలపట్నం తహసీల్లోకి..
కమాండ్ ప్రాంతాలకు నీటిని తరలించడానికి యాక్సెస్ ఛానెళ్ళు, గ్రావిటీ కెనాల్స్ ఉండేలా ప్రణాళిక చేశామన్నారు. మూడు పంప్ హౌస్లు, డెలివరీ సిస్టర్న్లు కూడా ఉన్నాయని, దాదాపు 90 కిలోమీటర్ల టన్నెల్ నెట్వర్క్, ఇది 4 టన్నెల్లుగా విభజించబడిందని, ఒక్కోటి 8 మీటర్ల వ్యాసంతో, 182 క్యూమెక్స్ ప్రవాహ సామర్థ్యాన్ని సరఫరా చేస్తుందన్నారు. ఈ టన్నెల్లు, క్రాస్ డ్రైనేజ్ పనులు, నియంత్రణలు, కాలువలపై రోడ్డు వంతెనలు ప్రాజెక్టు ఇంజనీరింగ్ రూపకల్పనకు వెన్నెముకగా నిలుస్తాయన్నారు. ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలోని భూపాలపట్నం తహసీల్లోకి విస్తరించి ముంపు కలిగిస్తుందని అంగీకరించారు. సుమారు 13.06 హెక్టార్ల భూమి, 54.03 హెక్టార్ల నది ప్రాంతం, 6.35 హెక్టార్ల నాళా భూమి ప్రభావితమవుతుందని వివరించారు.
ప్రస్తుత చట్టాల ప్రకారం..
ముంపునకు సంబంధించిన అన్ని ఖర్చులను, ఛత్తీస్గఢ్ పరిధిలోని భూసేకరణ, పునరావాసాన్ని తెలంగాణ(Telangana) ఇప్పటికే భరించడానికి అంగీకారం తెలిపిందన్నారు. పరిహారం, పునరావాసం యొక్క అంచనా ఖర్చుల వివరాలను పొందడానికి రాష్ట్రం అనేక సందర్భాల్లో ఛత్తీస్గఢ్తో సంప్రదింపులు జరిపిందని తెలిపారు. ముంపును అధ్యయనం చేయడానికి ఛత్తీస్గఢ్ ఐఐటీ ఖరగ్పూర్ను నియమించిందని, ఆ అధ్యయన ఫలితాలను అంగీకరించి అమలు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ సూచనలను పాటించి, ప్రస్తుత చట్టాల ప్రకారం ప్రభావిత భూస్వాములకు పరిహారం చెల్లించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. భూసేకరణ నిబంధనల ఆధారంగా లెక్కించి ఈ ముందస్తు చెల్లింపు, ఎన్ఓసీ కోసం ఉద్దేశపూర్వక పత్రాన్ని జారీ చేసే సమయంలో చెల్లించబడుతుందని వివరించారు. ఛత్తీస్ ఘడ్ సీఎం సానుకూల స్పందనతో ఈ అంశం ఇప్పుడు త్వరగా అధికారిక నిర్ణయానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: CMRF Fraud: సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ కేసు.. మరో ఇద్దరు అరెస్టు