Chamala Kiran Kumar: కాంగ్రెస్ లో సామాజిక న్యాయం లేదని బీఆర్ఎస్ నేత కవిత (Kalvakuntla Kavitha) చేసిన వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) తీవ్రంగా ఖండించారు. ముందు కుటుంబ పంచాయతీ ఏంటో చెప్పాలని నిలదీశారు. దోచుకున్న సొమ్ములో వాటా కోసమే మీ పోరాటం కదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS Party) గత పదేళ్లు రాష్ట్రాన్ని ఎలా దోచుకుందన్న దానిపై కవిత విచారణ కోరాలని పట్టుబట్టారు. ఈ విషయంలో ఒక ఎంపీగా తాను కలిసి వస్తానని.. ఇద్దరం సీబీఐ విచారణ కోరదామని అన్నారు. అప్పుడు కవితపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
ఇక్కడి ఎంపీలు పనికి రాలేదా?
విపక్ష బీజేపీపైనా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ వాళ్లకు ప్యాకేజీలు ఇస్తే ఎవరితోనైనా స్నేహం చేస్తారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజా సింగే (BJP MLA Raja Singh) చెప్పారని గుర్తుచేశారు. బీజేపీ తరపున 8 ఎంపీ స్థానాలను గెలుచుకున్న ఇక్కడి నేతలపై ప్రధాని మోదీకి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని అన్నారు. ప్రపంచ దేశాలకు ఆపరేషన్ సిందూర్ గురించి వివరిచేందుకు తెలంగాణ నుంచి ఇక్కడి బీజేపీ ఎంపీలు పనికి రాలేదా అని నిలదీశారు. బీజేపీలో BRS విలీనమా? లేక సేల్ ఆ? అని అంటూ ప్రశ్నించారు.
ఆ నైతిక హక్కు కవితకు లేదు
మరోవైపు బీఆర్ఎస్ పై చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipally Sathyam) ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళితులను కాంగ్రెస్ అవమానించిందన్న కవిత వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కవితకు గాని బీఆర్ఎస్ నేతలకు గానీ లేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే తొలి సీఎం దళితుడే ఉంటాడని చెప్పి కేసీఆర్ మాట తప్పలేదా? అంటూ నిలదీశారు. సీఎంగా ఉన్న సమయంలో దళిత మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మీడియా ముందు నెట్టేస్తూ కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు. దళిత బంధు పేరుతో దళితులను దగా చేశారని విమర్శించారు. మూడు ఎకరాల భూమి అంటూ దళితులను నిండా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Mahesh Kumar Goud: ఈటల, హరీశ్ సీక్రెట్ మీటింగ్.. టీపీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు
వారికి కాంగ్రెస్ అగ్రపీఠం
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దళితులకు అగ్రపీఠం వేస్తోందని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఏఐసీసీ ఇన్ ఛార్జీగా దళిత బిడ్డను నియమించిందని గుర్తుచేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎంగా దళిత బిడ్డ మల్లు భట్టివిక్రమార్కకు అవకాశం కల్పించారని అన్నారు. దళితులకు అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఇంట్లోని కుటుంబ తగాదాలను కాంగ్రెస్ పైకి రుదొద్దని కవితకు హితవు పలికారు.