Telangana: డిగ్రీలో 20 శాతం సిలబస్ మారనుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్ మరియు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ వంటి కొత్త అంశాలను చేర్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యారంగంలో విద్య, పరిపాలన సంస్కరణలపై శుక్రవారం అన్ని యూనివర్శిటీల వీసీలతో మాసబ్ ట్యాంక్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉన్నత విద్యారంగంలో అకాడమిక్ ఎక్సలెన్స్, పారదర్శకత, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని తెలిపారు. అంతేకాకుండా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా స్ట్రక్చర్డ్ లెర్నింగ్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. టీశాట్ భాగస్వామ్యంతో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ను సైతం డిజిటల్ ప్లాట్ ఫాంల ద్వారా అందించేందుకు ఎంవోయూ కుదుర్చుకున్నట్లు వివరించారు.
వంద మార్కుల కంటిన్యూస్ అసెస్మెంట్ ప్యాటర్న్ అమలు చేయాలని భావించారు. ఇందులో ప్రాజెక్ట్ వర్క్/అసైన్మెంట్ కు25 మార్కులు, మిడ్ ఎగ్జామ్ కు 25 మార్కులు, సెమిస్టర్ చివరి పరీక్షకు 50 మార్కులు ఉంటాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా తెలంగాణలోని అన్ని యూనివర్శిటీల్లో కామన్ అకడమిక్ క్యాలెండర్ ను అమలు చేయనున్నట్లు స్పష్టంచేశారు. దీనికి అన్ని వర్సిటీలు అంగీకారం తెలిపాయన్నారు.
కాగా ఏప్రిల్ 30 లోపు యూజీ పరీక్షలను పూర్తి చేసి మే నెలలో సెట్స్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. లా, ప్రొఫెషనల్, డిగ్రీ కాలేజీల అఫిలియేషన్కు గడువులు డెడ్ లైన్లు విధించామని, ఆయా యూనివర్శిటీలు అడ్మిషన్ల విషయంలో నిబంధనలు పాటించాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రకటించిన తర్వాత దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని బాలకిష్టారెడ్డి తెలిపారు.