Cyber Criminals: రకరకాలుగా మోసాలు చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్ తాజాగా ఆధ్యాత్మిక పర్యాటకంపై కన్నేశారు. దేశంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు వెళ్లే భక్తులను టార్గెట్ గా చేసుకుంటూ మోసాలు చేస్తున్నారు. ఇటీవల వరుసగా ఈ తరహా నేరాలు జరుగుతుండటంతో కేంద్ర హోంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైం కో ఆర్డినేషన్ సెంటర్ అలర్ట్ అయ్యింది. సైబర్ మోసగాళ్ల వలలో పడకండి అంటూ కొన్ని సూచనలు చేస్తూ ప్రకటన జారీ చేసింది.
33 రకాలుగా మోసాలు
ఆధ్యాత్మికతను అడ్డుపెట్టుకొని 33 రకాలుగా మోసాలు చేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఒక్క తెలంగాణ నుంచే ఏటా రూ.700 కోట్లు కొల్లగొడుతున్నట్లు అధికారులు తెలిపారు. కేదార్ నాథ్ యాత్రికులకు హెలికాప్టర్ బుకింగులు, చార్ ధామ్ యాత్రికులకు గెస్ట్ హౌసులు, హోటల్ బుకింగ్ లు, క్యాబ్ సర్వీసులు అందిస్తామంటూ ఫేక్ వెబ్ సైట్లు, ఫేస్ బుక్ పోస్టులు పెట్టి మరీ మోసాలు చేస్తున్నారు. గూగుల్ తదితర సెర్చ్ ఇంజన్లలో ప్రకటనలు ఇస్తూ వందల మందిని బోల్తా కొట్టిస్తున్నారు. హాలీడే ప్యాకేజీల పేరిట టోకరా ఇస్తున్నారు. వీరి వలలో చిక్కి చెల్లింపులు చేస్తున్న వారికి ఆ తరువాత అందాల్సిన సేవలు అందటం లేదు.
అప్రమత్తమైన కేంద్రం
ఆయా వెబ్ సైట్లు, పోస్టుల్లో ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్లకు ఫోన్లు చేస్తే స్పందన రావటం లేదు. అప్పుడుగానీ మోసపోయామని బాధితులకు తెలియటం లేదు. ఈ తరహా మోసాలు ఇటీవలిగా తరచూ వెలుగు చూస్తుండటంతో అప్రమత్తమైన కేంద్ర సైబర్ కో ఆర్డినేషన్ సెంటర్ అప్రమత్తమైంది. స్పాన్సర్డ్ పేరుతో ఫేస్ బుక్, వాట్సాప్ ల ద్వారా వచ్చే లింకులను నమ్మవద్దని సూచించింది. నమ్మి క్లిక్ చేసి డబ్బు కడితే మోసపోతారు జాగ్రత్త అని తెలిపింది. లింకులను క్లిక్ చేసే ముందు అవి అసలైనవా? నకిలీవా? అని నిర్ధారించుకోవాలని పేర్కొంది.
Also Read: MLC Local body elections: హైదరాబాద్ లో ఎలక్షన్స్.. రెండే పోలింగ్ బూత్ లు.. అంతా టెన్షన్ టెన్షన్!
మోసాలకు అడ్డుకట్ట
ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లు, నమ్మదగిని ప్రైవేట్ ఏజన్సీల ద్వారానే కావాల్సిన సేవల కోసం చెల్లింపులు జరపాలని తెలియచేసింది. మోసానికి గురైతే వెంటనే cybercrime.gov.in అన్న పోర్టల్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించింది. దాంతోపాటు 1930 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలియచేసింది. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేయటానికి తాము కూడా గూగుల్, ఫేస్ బుక్ తో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపింది.
