cast census: కుల గణన సర్వేలో గతంలో వివరాలు ఇవ్వనివారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈ నెల 28 వరకు నమోదు చేసుకోవాలని కోరింది. తొలిదశ సర్వేలో 3,56,323 కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకోలేదని, వీరి కోసం ప్రస్తుతం మూడు రకాలుగా అవకాశాలు కల్పిస్తున్న ట్లుగా రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపింది.
ఒకటి…. ఎన్యుమరేటర్లు ఇంటికి రాకపోతే seepcssurvey.cgg.gov.in అనే వెబ్సైట్ నుంచి సర్వే దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపి కుటంబ యజమాని సంతకం చేసి సమీపంలోని ప్రజా పాలన సెంటర్ కు వెళ్లి అందజేయాలని ప్రభుత్వం సూచించింది. అదిగాక పోతే… నేరుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం లేదా పట్టణాల్లోని మునిసిపల్ వార్డు కార్యాలయంలో ఉండే ప్రజా పాలన సేవా కేంద్రానికి వెళ్లినా అక్కడ వివరాలు నమోదు చేస్తారు. ఈ రెండూ చేయలేని వారు 040 21111111 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే ఎన్యుమరేటర్లే ఇంటికి వస్తారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మూడు అవకాశాలో ఏదైనా ఒకటి ఉపయోగించుకొని అందరూ తమ వివరాలు నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం కోరింది. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది.
ఇదిలాఉండగా, కుల గణనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన విధంగా కుల గణనకు కట్టుబడి ఉన్నామని అధికారం చేపట్టిన అనంతరం పలు మార్లు సీఎం రేవంత్ చెబుతూనే ఉన్నారు. చెప్పిన విధంగానే తెలంగాణ వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల సర్వేను సమగ్రంగా నిర్వహించింది. దాదాపు 50 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దీని కోసం ప్రత్యేకంగా ఎన్యుమరేటర్లను ప్రభుత్వం నియమించింది.
తొలుత ప్రతి ఇంటికి వెళ్లి వీరంతా వివరాలు సేకరించి అనంతరం వాటిని ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ఇటీవలే ఆ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం గణాంకాలతో సహా వెల్లడించింది. కాగా, అందులో 96.9 శాతం మంది గణనలో పాల్గొన్నారని మిగిలిన 3.1 శాతం మంది వివరాలు అందజేయలేదని వారిని మినహాయించి లెక్కలను అసెంబ్లీ సాక్షిగా ముందుంచింది.
అయితే సర్వే అంతా తప్పుల తడక అని, బీసీల శాతం కావాలనే తగ్గించారని అధికార పార్టీ ఎమ్మెల్సీ తో పాటు బీసీ సంఘాలు, బలహీన వర్గాల మేధావులు ఆరోపణలు వ్యక్తం చేశారు. ఓ దశలో…. కేసీఆర్ అధికారం చేపట్టాక నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేనే నయమని విమర్శించారు. ఆ సమయంలో అంటే పదేళ్ల క్రితం చూపించిన బీసీల కంటే ఇప్పడు సంఖ్య తగ్గిందని, అదేలా సాధ్యమని నిరసన వ్యక్తం చేశారు. అటు ప్రతిపక్ష బీఆర్ సైతం ఓసీ లను తమ హయాంలో కంటే పెంచి చూపించారని ఆరోపించింది. ఇక, ముస్లీంలను బీసీల జాబితాలో చేర్చడంపై బీజేపీ తప్పుబట్టింది. ఇవన్నీ ఇలా ఉంటే… బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, కేసీఆర్ కుటుంబ సభ్యులు సర్వేలో పాల్గొనలేదని ముందు వారు వివరాలు ఇస్తే ఒకవేళ మిగిలిపోయిన లెక్క ఏదైనా ఉంటే అది తేలుందని సీఎం విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇచ్చేందుకు గాను ఆదివారం నుంచి ఇంకోసారి సర్వే చేయనున్నారు.