Armur Constituency: ఆర్మూర్ నియోజవర్గంలో అభ్యర్థి మార్పుపై మొదలైన ఊహాగానాలు
ప్రతి ఎన్నికల్లో అక్కడి నుంచే బీఆర్ఎస్ మొదటి పేరు ప్రకటన
ఆరోపణలు లేని అభ్యర్థుల కోసం గులాబీ బాస్ అన్వేషణ
అందుకే ఆ మాజీ ఎమ్మెల్యేను ఫామ్ హౌస్ నుంచి గెట్ ఔట్ అన్నారా?
పార్టీలో జోరందుకున్న కొత్త చర్చ
Armur Constituency: ఆ నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న స్థానం. పలువురు సీనియర్ నేతలు సైతం ఆ నియోజకవర్గం నుంచి పైకి ఎదిగిన ట్రాక్ రికార్డు ఉన్న సీటు అది. రెండు సార్లు గులాబీ పార్టీకి అవకాశం ఇచ్చిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు అభ్యర్థిని మార్చాలని బీఆర్ఎస్ అధిష్ఠానం చూస్తోందా?, అందుకే ఇటీవల కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి ఆ మాజీ ఎమ్మెల్యేను ‘గెట్ ఔట్ ఆఫ్ మై ఫామ్ హౌస్’ అన్నారా?, పార్టీ అధినేత ఎందుకు అలా అనాల్సి వచ్చింది?. పెద్దాయనకు అంతలా కోపం తెప్పించేలా ఏం జరిగింది?. ఆసక్తికరమైన పొలిటికల్ పరిణామంపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం.
ప్రస్తుతం రాష్ట్రమంతా బీసీ నినాదమే వినిపిస్తోంది. ఈ పరంపరలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజవర్గంలోనే మొదటి బీసీ బాంబ్ పేలనుందా? అంటే, నిజమే అనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఆర్మూర్ అంటేనే ‘వెరీ హాట్ గురూ’ అంటారు అక్కడి ఓటర్లు. రాజకీయంగా విభిన్న తీర్పు ఇవ్వటంలో ఆ నియోజకవర్గం పెట్టింది పేరు. జిల్లా పాలిటిక్స్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తుంటుంది. ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ‘ఫైర్ బ్రాండ్’గా పేరు తెచ్చుకున్నారు. అతి తక్కువ కాలంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. ఇక, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆశన్నగారి జీవన్ రెడ్డి.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నో అవినీతి ఆరోపణలు, వివాదాలు చుట్టుముట్టడంతో మొన్నటి ఎన్నికల్లో మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో పార్టీ అధినేత ప్రత్యామ్నాయ నాయకత్వంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది.
తెరపైకి కొందరి పేర్లు..
నందిపేట్ నివాసి అయిన చార్టెడ్ అకౌంటెంట్గా చారిటబుల్ ట్రస్టులు నడుపుతున్న బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఈరవత్రి రాజశేఖర్ రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నారని సమాచారం. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం, ఆర్మూర్ నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గానికి భారీ ఓటు బ్యాంకు కూడా ఉంది. ఇక, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన దివంగత నేత ఆలూరు గంగారెడ్డి కూతురు విజయ భారతి రెడ్డి గత నెలలోనే మాజీ మంత్రి కేటీఆర్ను ఫామ్ హౌస్లో కలవడం ఆర్మూర్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్తో వెన్నుదన్నుగా ఉన్న గంగారెడ్డి కూతురి వెళ్లి కేటీఆర్ను కలవడంతో నియోజకవర్గంలో మార్పులు ఉండవచ్చనే ఊహాగానాలు జోరుగా వెలువడుతున్నాయి.
ఆర్మూర్.. కేసీఆర్కు సెంటిమెంట్
ఆర్మూర్ నియోజకవర్గం కేసీఆర్కు కొంత సెంటిమెంట్ అనే టాక్ ఉంది. 2014లో అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఫస్ట్ టికెట్ ఈ నియోజకవర్గానిదే ప్రకటన చేస్తారు. పదేళ్లుగా ఆర్మూర్లో కారు పార్టీ బలంగా ఉండడంతో ఈసారి టికెట్ ఓడిపోయినప్పటికీ.. రానున్న ఎన్నికల్లోగా పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంలో గులాబీ బాస్ ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్తో ఆర్మూర్ నియోజకవర్గంలో పేరుగాంచిన చార్టెడ్ అకౌంటెంట్ అయినా ఈరవత్రి రాజశేఖర్ టచ్లో ఉన్నట్లుగా పక్కాగా తెలుస్తోంది. ఈసారి మహిళా నేతను బరిలో దింపాలని అధినేత భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలు బీఆర్ఎస్లో కొత్త చర్చకు దారి తీశాయి. ఆర్మూర్ నియోజవర్గంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోవడం, మాజీ ఎమ్మెల్యేపై వివాదాలు ఉండడంతో.. అసలు వివాదాలు లేని, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారి కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్, ఆలూరు గంగారెడ్డి కూతురు విజయ భారతి రెడ్డి.. కేటీఆర్ ద్వారా కేసీఆర్తో టచ్లో ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also- Khammam Police Station: మద్యం మత్తులో రోడ్డుకు అడ్డంగా పడుకున్న వ్యక్తి.. 11 మందిపై కేసు నమోదు
ఇక చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్ తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవలు చేస్తూ వస్తున్నారు. విజయభారత్ రెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలో కార్పొరేటర్గా పనిచేసి తండ్రి రాజకీయ వారసురాలిగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. ఆర్మూర్ నియోజవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిస్తే, బీజేపీ సీటును గెలుపొందింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వివాదాలకు కేరాఫ్గా మారిపోవడంతో నూతన, యువతరం మహిళా నేతను బరిలో దింపాలని బీఆర్ఎస్ అధినేత ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్మూర్లో నయా లీడర్ కోసం గులాబీ బాస్ అన్వేషిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి నిజం అయితే ఎన్నికల్లో విభిన్న తీర్పు ఇచ్చే ఓటర్లు ఈ సారి ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. వచ్చే ఎన్నికలకు ఇంకా టైం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గంపై బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశావహులు బయట పడటం, మాజీ జీవన్ రెడ్డిపై గులాబీ బాస్ సీరియస్గా ఉన్నారనే ప్రచారానికి తోడు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వరనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కవిత ఓటమికి జీవన్ రెడ్డి కూడా ఒక కారణం అనే ప్రచారం కూడా ఉండడంతో ఈ సారి జీవన్ రెడ్డికి మొండిచేయి దక్కదంటూ సొంత పార్టీలో సైతం చర్చ జరుగుతోంది.
Read Also- Manuguru Incident: పెద్ద కొడుకు నిర్వాకం.. భోరున ఏడుస్తున్న తల్లితండ్రులు