BJP Telangana: సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగింది. గతంలో అసలు పోటీలో ఉన్నామా? అనే స్థాయి నుంచి తాము పోటీ ఇవ్వగలమనే స్థాయికి క్రమంగా ఎదుగుతోంది. దానికి ఈ సర్పంచ్ ఎన్నికలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు బీజేపీకి నూతనోత్సాహాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్ నియోజకవర్గంలో కమలం పార్టీ తన సత్తా చాటింది. ఇక్కడ మొత్తం 128 సర్పంచ్ స్థానాలకు గాను, 80 స్థానాల్లో బీజేపీ మద్దతు దారులు విజయం సాధించడం గమనార్హం.
ఇది ఉత్తర తెలంగాణలో పార్టీకి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా కాంగ్రెస్ 31 స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇండిపెండెంట్, ఇతరులు కలిపి 17 స్థానాలు కైవసం చేసుకున్నారు. బీజేపీ అత్యధికంగా గెలిచిన లోక్ సభ స్థానాలు, అత్యధికంగా గెలిచిన ఎమ్మెల్యే స్థానాలు కూడా ఉత్తర తెలంగాణకు చెందిన సెగ్మెంట్లే కావడం గమనార్హం. ఇప్పుడీ ప్రాంతం కమలం పార్టీకి ఆయుపట్టుగా మారింది. లోక్ సభ, అసెంబ్లీతో పాటు సర్పంచ్ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగించింది.
Also Read: BJP Telangana: అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ.. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై ఫోకస్
బీజేపీకి గణనీయమైన పురోగతి
సర్పంచ్ ఎన్నికల ఫలితాలు నిర్మల్ జిల్లా రాజకీయాల్లో కాషాయ పార్టీకి ఉన్న పట్టును స్పష్టం చేస్తున్నాయి. కేవలం నిర్మల్ సెగ్మెంట్ కే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కూడా బీజేపీ గణనీయమైన పురోగతిని సాధించింది. 2019 సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ 165 స్థానాలు గెలుచుకోగా, ప్రస్తుత ఎన్నికల్లో(రెండు దశలు ముగిసేసరికి) ఈ సంఖ్య 600కు పైగా చేరింది. ఇది దాదాపు 385 శాతం వృద్ధిని సూచిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిర్మల్ సెగ్మెంట్ లో కమలం పార్టీ అసాధారణ గెలుపుపై పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి మరీ అభినందించినట్లు తెలిసింది.
ఇది ఆరంభమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతానికి పరిమితమైన కాషాయ పార్టీ రాబోయే రోజుల్లో గ్రామీణ తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందనేందుకు నిదర్శనమని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫలితాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మద్దతులో స్పష్టమైన మార్పును చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్ లో తెలంగాణలో బీజేపీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమనేందుకు ఇది సంకేతంగా శ్రేణులు భావిస్తున్నాయి.
టీబీజేపీలో మారుతున్న సమీకరణాలు
తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల ఫలితాలను చూస్తుంటే టీబీజేపీలో సమీకరణాలు మారుతున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ఫర్ఫామెన్స్ చూపిన లీడర్లకు భవిష్యత్లో ప్రాధాన్యత పెరగనుందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. దీనికి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కి అధిష్టానం ఫోన్ పలకరింపు రావడమే సంకేతంగా చెప్పుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో ఇప్పుడు మెరుపు వేగంతో దూసుకుపోతున్న నాయకుడు.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో కమలం వికాసం, సర్పంచ్ పోరులో తిరుగులేని విజయాన్ని మాటల్లో కాకాండా చేతల్లో చూపించారు. క్షేత్రస్థాయిలో ఇటు స్ట్రీట్ ఫైటర్ గా.. అటు స్టేట్ లీడర్ గా పనిచేస్తూ బీజేపీ అధిష్టానం అటెన్షన్ ను తనవైపునకు తిప్పుకున్నారు. నిర్మల్ సెగ్మెంట్ లో జరిగిన సర్పంచ్ ఎన్నికల యుద్ధం ఓ ట్రైలర్ గా శ్రేణులు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే నిర్మల్ జిల్లా ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పటంలో కమలం కోటగా మారినట్లుగా తెలుస్తోంది.
మహేశ్వర్ రెడ్డి పక్కా వ్యూహంతో పావులు
పల్లె పోరులో మహేశ్వర్ రెడ్డి పక్కా వ్యూహంతో పావులు కదిపినట్లు ఈ గెలుపును చూస్తే అర్థమవుతోంది. పబ్లిక్ ఇష్యూస్పై ఆయన పోరాటం కూడా అదే రీతిలో ఉంటుందనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. హెచ్ఐఎల్ టీ పాలసీపై తొలి గళం ఆయనదే. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం సింగరేణి సంస్థ నిధుల దుర్వినియోగంపై సమర భేరి చేసింది కూడా ఆయనే. ఇలా టీబీజేపీలో ఇతర నేతలతో పోలిస్తే ఏదైనా అంశంపై కంప్లీట్ స్టడీ చేసి తనదైన స్ట్రాటజీతో ప్రత్యర్థులకు చెక్ పెట్టడం ఢిల్లీ దృష్టిని మరింతగా ఆకర్షించింది. కాగా సర్పంచ్ ఎన్నికల విజయంలో తనదైన ముద్ర వేసిన ఆయనకు పార్టీలో ఆయనకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం ఖాయమనే ప్రచారం పార్టీలో జోరుగా వినిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు, ప్రధాని మోడీ విదేశీ పర్యటన అనంతరం.. ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జాతీయ అధిష్టానాన్ని కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.
Also Read: BJP Telangana: అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ.. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై ఫోకస్

