తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Bhu Bharati Actc: తెలంగాణ రాష్ట్ర ప్రజల భూములకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు భూభారతి చట్టాన్ని ప్రజలకు అందించడంతో తన జన్మధన్యమైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆయన హైదరాబాద్ లో భూ భారతి పోర్టల్ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ దొరల హయాంలో నాలుగు గోడల మధ్య నలుగురు కలసి రూపొందించిన 2020 రెవెన్యూ చట్టం- ధరణితో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిందన్నారు.రెవెన్యూ వ్యవస్ధ కూడా తెల్లవారు జామున దొర మదిలో మెదిలిన ఆలోచనలకు అనుగుణంగా పరిగెత్తలేకపోయారన్నారు.
అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ చట్టాన్ని స్వార్దప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడానికి గ్రామపరిపాలనాధికారుల వ్యవస్దను కూడా రద్దు చేశారని గుర్తు చేశారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర సహచర మంత్రులు ఎంతో కృషి చేసి రూపొందించిన ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే బీఆర్ ఎస్ సభ్యులు ఏ విధంగా అపహాస్యం చేశారో, అడ్డుకోవడానికి ప్రయత్నించారో గమనించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. 2020 రెవెన్యూ చట్టం మూడేళ్లలో మురిగిపోగా, ఇప్పుడు 2025 భూభారతి చట్టం వందేళ్లు వర్ధిల్లుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read: Minister Sridhar Babu: పెద్దమొత్తంలో ఆ పథకానికి నిధులు విడుదల.. మంత్రి శ్రీధర్ బాబు
ఈ చట్టాన్ని సమర్ధవంతంగా ప్రజలకు అందించేందుకు గాను 4 జిల్లాల్లోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశామన్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్, ములుగు, కామారెడ్డి జిల్లాలను ఎంపిక చేశామన్నారు. అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరిస్తారన్నారు. ఈనెల 17 నుంచి కలెక్టర్లు రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఈ చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తారన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని , భేషిజాలకు పోకుండా అవసరమైన మార్పులు చేసి జూన్ 2 తేదీనాటికి సమగ్ర చట్టాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తామన్నారు. మే మొదటివారంలో రాష్ట్రంలో మిగిలిన 29 జిల్లాలలో ఒక్కో మండలాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి సమస్యలను స్వీకరించి భూభారతి చట్టాన్నిపటిష్టపరుస్తామన్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సవరిస్తామన్నారు. దీనికోసం ఎమ్మార్వో స్దాయిలో అధికారుల బృందం పనిచేస్తుందన్నారు. చట్టాన్ని ప్రజల కోసం ఇందిరమ్మ ప్రభుత్వం రూపొందించినా, దీనిని సమగ్రంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని వెల్లడించారు. పేద , దళిత, గిరిజనుల పరిస్ధితులను దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా భూభారతిని అమలు చేయాలని అధికారులను కోరారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/