Vikramarka on HCU Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూపులతో ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి నియమించిన సబ్ కమిటీ సమావేశమైంది.
దీంట్లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూముల వ్యవహారంలో ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారని, వాళ్లు ఇప్పటికీ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారని టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూపుల ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకు వచ్చారు. వీరిపై నమోదైన కేసులను ఉపసంహరించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఈ క్రమంలో స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులపై నమోదు చేసిన కేసులను కొట్టి వేయాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు అధికారులకు తగు సూచనలు ఇవ్వాలని న్యాయశాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, న్యాయశాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు